సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ ) : దోమల నివారణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు తెలిపారు. దోమలు పుట్టకుండా చేయడంతో పాటు కుట్టకుండా.. అంతం చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం ఆయన దోమల నివారణకు సంబంధించిన ప్రత్యేక ప్రచార సామగ్రిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ యాంటీలార్వా కార్యక్రమంతో పాటు ఈ సారి వర్షాకాలంలో భవన నిర్మాణ ప్రాంతాలు, ఫంక్షన్హాళ్లు, సెల్లార్ ప్రదేశాలు, ఓపెన్ ప్లాట్లు, మూతబడిన ఇండ్లు తదితర ప్రాంతాల్లో రసాయనాలను పిచికారీ చేయడం జరుగుతుందని చెప్పారు.
ఓపెన్ నాలాలు, మూసీ పరీవాహక ప్రాంతాలు, మురికివాడలు, 185 చెరువులు, నీటి నిల్వ ప్రాంతాల్లో దోమల నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. వీటితో పాటు డ్రోన్ పిచికారీ, టీవోటీ మిషన్, మస్కిటో ట్రాప్ మిషన్స్, మష్కిట్ కిల్లింగ్ మిషన్స్, ఆయిల్ బాల్స్, గంబుషియా ఫిష్, ఫాగింగ్ చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా డెంగ్యూ, మలేరియా కేసుల వివరాలను జీఐఎస్ మ్యాపింగ్ చేసి కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ నామాల శ్రీనివాస్ రూపొందించిన ప్రత్యేక స్టిక్కర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్లు, సూపర్వైజర్లు, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.