సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో 610 శిథిల భవనాలను గుర్తించిన పట్టణ ప్రణాళిక విభాగం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 175 పురాతన భవానాలను కూల్చివేసి మరో 84 భవనాలకు మరమ్మతులు చేయించింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. గత సంవత్సరం 231 శిథిల భవనాలను కూల్చి వేయగా 129 భవనాలకు మరమ్మతులు, సీజ్ చేశామని అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ అధికారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అత్యంత ప్రమాదకర భవనాలను కూల్చి వేయాలని నిర్ణయించామని వారు తెలిపారు. అంతేకాక కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించేందుకు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని అన్నారు.