సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ) : భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అత్యాధునిక టెక్నాలజీతో దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు చోట్ల సీఅండ్డీ (కన్స్ట్రక్షన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్లను ఏర్పాటు చేశారు. వీటిద్వారా పర్యావరణానికి మేలు జరగడంతో పాటు రీసైక్లింగ్తో మంచి ఫలితాలు వస్తున్నాయి. దీంతో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని అధికారులు భావించారు. భవన నిర్మాణ వ్యర్థాల తరలింపులో 18001201159 టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ కొన్ని చోట్ల చెరువులు, కుంటలు, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ భవన నిర్మాణాల వ్యర్థాలను పడేస్తున్నారు. భవన నిర్మాణ వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ పారబోస్తే సంబంధిత భవన యాజమానులపై చర్యలు తీసుకుంటామని, మొదటి సారి పట్టుబడితే రూ.25వేలు, రెండో సారి పట్టుబడితే రూ.25 వేలు, మూడవ సారి పట్టుబడితే లక్ష రూపాయల జరిమానాతో పాటు ఆయా వాహలను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
పౌరుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ను తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిందా? పాత భవనాన్ని కూల్చివేశారా? ఈ రెండింటిలో ఏది జరిగినా.. వ్యర్థాలను తీసుకువెళ్లాలని యాప్లో వివరాలు పొందుపరిస్తే చాలు నేరుగా వచ్చి వాటిని ప్లాంట్కు తరలించనున్నారు.
ఒకప్పుడు అపరిశుభ్రతకు ప్రధాన కారణమైన భవన నిర్మాణాల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి రీయూజ్ (పునర్ వినియోగం)లోకి తీసుకువస్తూ జీడిమెట్ల, ఫతుల్లాగూడలో సీఅండ్డీ ప్లాంట్ను నెలకొల్పారు. ఈ రెండు ప్లాంట్ల ద్వారా రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నారు. రీసైక్లింగ్లో భాగంగా వ్యర్థాల నుంచి పెద్ద, చిన్న సైజు కంకర, ఇసుక ఉత్పత్తి చేస్తున్నారు. దీన్ని భవనాలు, ఫ్లైఓవర్లు, ఇతర నిర్మాణాల్లో వాడుతుండగా.. టైల్స్ను కూడా తయారు చేస్తుండటంతో ఫుల్పాత్లతో పాటు గృహాల్లోనూ వినియోగిస్తున్నారు. ఇలా 95శాతం రీ యూజ్లోకి తీసుకువస్తూ భవన నిర్మాణ వ్యర్థాల ద్వారా సంపద సృష్టించడంలో భాగంగా త్వరలోనే కొత్వాల్గూడ , మల్లాపూర్లో మరో రెండు ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.