సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ ): అల్పపీడన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గతేడాది భారీ వర్షాల అనుభవం దృష్ట్యా జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. వర్షం ప్రభావం, చేపట్టాల్సిన చర్యలపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ మేరకు మేయర్ కార్యాలయం ఓఎస్డీ నగరంలోని ఎమ్మెల్యేలతో స్వయంగా మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లకు సమాచారం అందించారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు చోట్ల డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయని ఎమ్మెల్యే తెలుపగా, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులకు మేయర్ కార్యాలయం సమాచారం అందించారు. రామంతాపూర్ పెద్ద చెరువు పూర్తిగా నిండడంతో అందులోని నీటిని తోడేందుకు 125ఎంవీ సామర్థ్యం గల మోటార్ కావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి కోరగా, వెంటనే ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డితో ఏర్పాటుపై చర్చించారు. గోషామహల్ పరిధిలో పోలీస్స్టేషన్ ఎదురుగా నాలాలో నీరు అధికంగా ప్రవహిస్తుండడంతో నీటిని తోడి వేయడానికి మోటార్లను ఏర్పాటు చేయాల్సిందిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరగా, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావీణ్యకు మేయర్ కార్యాలయం సమాచారం అందించారు.
శేరిలింగంపల్లి , ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మలక్పేట, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, అంబర్పేట, యాకత్పురా, బహదూర్పురా, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన మేయర్ కార్యాలయం పలు సమస్యలకు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు.
వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాగోల్లోని అయ్యప్ప కాలనీ, శ్రీమహాలక్ష్మీ వాంబే కాలనీలో మేయర్ విజయలక్ష్మి అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఆదర్శనగర్ కాలనీ ట్రంక్లైన్ పనులను మేయర్ పరిశీలించారు. అనంతరం ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో అధికారులతో మేయర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో మూడు రోజులు నగరంలో వానలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాల వల్ల ఏదైనా సమస్యలు తలెత్తితే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నంబర్ 040-2111 1111కు ఫోన్ చేయాలని నగరవాసులకు మేయర్ సూచించారు.