సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ కొత్త పాలకమండలి కొలువుదీరాక జరిగిన మొట్ట మొదటి సర్వసభ్య సమావేశం (వర్చువల్) విజయవంతమైంది. జీహెచ్ఎంసీ పాలకమండలి ఫిబ్రవరి 11వ తేదీన ఏర్పడిన అనంతరం తొలిసారిగా మంగళవారం వర్చువల్ విధానంలో జరిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయం నుంచి జరిగిన ఈ వర్చువల్ సమావేశానికి 156 మంది కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులు, కమిషనర్ లోకేశ్కుమార్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తన ప్రారంభ ఉపన్యాసం అనంతరం 2021-22 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్పై విస్తృత చర్చల అనంతరం బడ్జెట్ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం గతంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలను ఈ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. కాగా సర్వసభ్య సమావేశం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కాగా, మధ్యాహ్నం 2:30 గంటల వరకు సాగింది. నాలుగున్నర గంటల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరిగిన తీరు పట్ల మేయర్ను పలువురు ప్రశంసించారు. మేయర్గా మొదటిసారిగా జనరల్ బాడీ సమావేశం కావడం, అందులో ఆన్లైన్ అయినప్పటికీ అందరూ సంతృప్తి చెందేలా సభను నిర్వహించడం గమనార్హం.
అనంతరం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు లేవనెత్తిన 14 ప్రశ్నలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. పలువురు కార్పొరేటర్లు సమస్యలను మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ఎంఐఎం నుంచి రాజ్ మోహన్ , మహమూద్ మాజీద్ హుస్సేన్లు పారిశుధ్య సమస్యలపై ప్రశ్నించారు. బీజేపీ నుంచి జి.శంకర్ యాదవ్, రాకేశ్ జైశ్వాల్లు సిద్దిఅంబర్బజార్, ఫలక్నుమాలో నాలాల పూడిక తీత పనులపై, పారిశుధ్య సమస్యలపై మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి శిరీషారెడ్డి సింగిరెడ్డి హరితహారం పథకంపై మాట్లాడారు. నల్ల చెరువు బ్యూటీఫికేషన్ పనులపై ఎం.రజిత, పటేల్కుంట చెరువు బ్యూటీఫికేషన్పై శాంతి సాయిజన్ శేఖర్లు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు. వర్షాకాల ప్రణాళికపై వంగ మధుసూదన్ రెడ్డి, నగరంలో గ్రేవ్ యార్డ్ల అభివృద్ధిపై పన్నాల గీతాప్రవీణ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బాలానగర్లోని కెమికల్ నాలాపై రిటైనింగ్ వాల్ నిర్మాణంపై కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై జగదీశ్వర్ గౌడ్, ఇతర సభ్యులు లేవనెత్తిన ఈ ప్రశ్నలకు కమిషనర్ లోకేశ్కుమార్ పూర్తి స్థాయి సమాధానం ఇచ్చారు. అంతకుముందు ఇటీవల ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి హాజరయ్యారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొట్టమొదటి సారిగా నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో వర్చువల్ విధానంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం విజయవంతమైంది. కార్పొరేటర్లందరూ ఈ సమావేశంలో పాల్గొని డివిజన్ల వారీగా సమస్యలు వివరించారు. బడ్జెట్ ద్వారా ప్రజల అభ్యున్నతి, అభివృద్ధికి సానుకూలమైన అంశాలను తీసుకున్నాం. – మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, డిప్యూటీ మేయర్