మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలకమండలి తొలి సర్వసభ్య సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 29న సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ మేరకు పాలకమండలి సభ్యులందరికీ సమాచారం చేరవేస్తున్నారు. కరోనా నేపథ్యంలో వర్చువల్ పద్ధతిన సమావేశం నిర్వహించనుండగా, స్థానిక సంస్థల చరిత్రలో ఇదే ప్రథమం. ఈ సమావేశంలోనే 2021-22 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను పాలకమండలి ఆమోదించి ప్రభుత్వానికి నివేదించనుంది. బల్దియా ఎన్నికలు గతేడాది డిసెంబర్ 1న జరగగా, 4న ఫలితాలు వచ్చాయి. ఫిబ్రవరి 11న నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిగింది. ఆ తర్వాత కరోనా రెండోదశ విజృంభణ, లాక్డౌన్ నేపథ్యంలో సమావేశం జరగలేదు.
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఈనెల 29న ఉదయం 10.30 గంటలకు జీహెచ్ఎంసీ బడ్జెట్ ఆమోదం, అనంతరం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ సెక్రటరీ రామ్కిశోర్ సభ్యులకు సమాచారం పంపిస్తున్నారు.‘గూగుల్మీట్’ ద్వారా వర్చువల్గా సమావేశం జరుగనుందని, ఈ సమావేశానికి సంబంధించిన ఐడీ, పాస్వర్డ్ వివరాలను ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా ఈ వారంలో పంపించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మీటింగ్లో పాల్గొనేటప్పుడు సభ్యులు పేరుతో పాటు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డు (డివిజన్) పేరు తెలియజేయాలని సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏడో అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్ వేదికగా జరిగే ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ లోకేశ్కుమార్ , ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఏ స్థానిక సంస్థలోనూ జరుగని విధంగా వర్చువల్గా జరుగనున్న నగరపాలక సంస్థ తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం.
ఈనెల 29వ తేదీన వర్చువల్ విధానంలో పాలకమండలి సమావేశం ఏర్పాటు చేయనుండడంతో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఎక్కడి వారు అక్కడ తమ వాణిని వినిపించనున్నారు. వానకాలానికి సంబంధించి నాలాల విస్తరణ, ఆధునీకరణతో పాటు డీసిల్టింగ్ పనులు, చెత్త తదితర సమస్యలపై మాట్లాడనున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం 2021-22 బడ్జెట్ను ఎన్నికలు జరుగడానికి ముందే అప్పటి స్టాండింగ్ కమిటీ ఆమోదించినప్పటికీ సాంకేతికంగా జనరల్ బాడీలోనూ ఆమోదం తెలిపి ప్రభుత్వానికి నివేధించడం సంప్రదాయం. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5600 కోట్ల బడ్జెట్కు గత పాలకమండలిలోని స్టాడింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది.కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ బడ్జెట్కు ఆమోదం జరుగాల్సి ఉన్నప్పటికీ పాలకమండలి సమావేశం జరుగలేదు. కొత్త పాలక మండలి ఏర్పాటై నాలుగు నెలలు గడిచినా ఇప్పటి వరకు సమావేశం జరుగకపోవడంతో బడ్జెట్ ఆమోదానికి నోచుకోలేదు. దీంతో వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో తొలి ఎజెండాగా బడ్జెట్ అంశాన్ని చేర్చారు.