వందేండ్ల తర్వాత కురిసిన భారీ వర్షంతో గతేడాది నగరం వణికిపోయింది. ఉప్పొంగిన చెరువులతో అనేక కాలనీలు నీటమునిగాయి. ప్రధాన మార్గాలతోపాటు అంతర్గత రహదారుల్లోనూ రవాణా స్తంభించింది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వానకాలం సమీపిస్తుండడంతో మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ముందే అప్రమత్తమైంది. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇందుకు ప్రత్యేకంగా రూ.32.96 కోట్లతో వానకాలం ప్రణాళిక (మాన్సూన్ యాక్షన్ ప్లాన్)ను ఖరారు చేసింది. ఇందులో భాగంగా బల్దియా పరిధిలోని 32 సర్కిళ్లలో 139 బృందాలను రంగంలోకి దింపారు. వీరంతా (స్టాటిక్ లేబర్ టీం) కేటాయించిన ఆయా ప్రాంతాల్లో వచ్చిన వరద వచ్చినట్టే సాఫీగా పోయేలా చర్యలు చేపట్టనున్నారు. నలుగురితో కూడిన 67 బృందాలు, మినీ మొబైల్ వాహనాలతో 128 బృందాలు డీఆర్ఎఫ్ టీంతో కలిసి సహాయక చర్యలు చేపట్టనున్నాయి. కాగా, గత వర్షాకాలం ముగిసిన నాటి నుంచి నాలాల పూడికతీత పనులు శరవేగంగా నిర్వహించారు. 24 ఎక్సావేటర్లు, 30 జేసీబీలతో యుద్ధప్రాతిపదికన పూడికతీత బుధవారం నాటికి 80శాతం పూర్తి చేసినట్లు ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు రాక ముందే గ్రేటర్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తన ద్రోణికితోడు అధిక ఉష్ణోగ్రతల వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడడంతో బుధవారం నగరంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా శేరిలింగంపల్లిలోని ఖాజాగూడలో 4.5 సెం.మీ, మాదాపూర్ కాకతీయ హిల్స్లో 2.6 సెం.మీలు, గచ్చిబౌలిలో 2.5 సెం.మీలు, మణికొండలో 2.3 సెంమీ, అత్యల్పంగా ఖైరతాబాద్లో 1.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాగల రెండు రోజులు పలుచోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నగరంలో బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 34.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీలు నమోదైనట్లు తెలిపారు.
సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ ): వరదనీటి సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికతో సన్నద్ధమైంది. గతనుభవాల దృష్ట్యా ఈ సారి ఎంతటి భారీ వర్షం కురిసినా రోడ్లపై నీరు నిల్వకుండా పటిష్ట చర్యలు తీసుకునేలా దృష్టి సారించింది. ఈ మేరకు రూ. 32.96 కోట్ల ప్రత్యేక బడ్జెట్తో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ను ఖరారు చేసింది. మరోవైపు వర్షాకాలం రాకముందే నాలా పూడికతీత పనులను పూర్తి చేసే పనిలో పడింది. ఇప్పటికే 24 ఎక్సవేటర్లు, 30 జేసీబీలతో యుద్ధ ప్రాతిపదికన నాలాల పూడికతీత పనులను బుధవారం నాటికి 80 శాతం మేర పూర్తి చేసినట్లు ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. ఇక మాన్సూన్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఏరియాల వారీగా 139 బృందాలను రంగంలోకి దింపారు. వీరంతా (స్టాటిక్ లేబర్ టీం) కేటాయించిన ఆయా ప్రాంతాలలో వరద నీరు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టనున్నారు. ఇక భారీ వాహనాలతో నలుగురితో కూడిన 67 బృందాలు, మినీ మొబైల్తో 128 బృందాలు డీఆర్ఎఫ్ టీంతో కలిసి సహాయక చర్యలు చేపట్టనున్నాయి.
అంతర్గత రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ ప్రధానంగా ఫుట్పాత్ల మరమ్మతులు, ఫుట్పాత్ రాళ్లు, డివైడర్లు , మ్యాన్హోళ్ల కవర్ల మార్పిడి తదితర పనులకు నిర్వహించేందుకు 69 అత్యవసర బృందాలను రంగంలోకి దింపింది. ఈ అత్యవసర బృందాలు (ఐఆర్టీ) అంతర్గత రహదారులను మెరుగుపర్చడంతో పాటు ఇప్పటి వరకు 12,944 చోట్ల రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.