మెహిదీపట్నం మే 21: వర్షాలు వచ్చినప్పుడల్లా కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లోని టోలీచౌకి, నానల్నగర్, అహ్మద్నగర్ ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీరి కష్టాలు తొలిగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఈ మేరకు శుక్రవారం నానల్నగర్ డివిజన్ హకీంపేట బట్ఫైర్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యేలు కౌసర్ మొహినుద్దీన్, జాఫర్మెరాజ్ హుస్సేన్లు పర్యటించారు. ఈ సందర్భంగా కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ అధికారుల బృందానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు వివరించారు.
హకీంపేట ,నిజాం కాలనీ, అల్హస్నత్ కాలనీ, టోలీచౌకి డివిజన్లోని నదీం కాలనీ, శాతంనగర్, బాల్రెడ్డి నగర్, ఛాబ్రాఎన్క్లేవ్ పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు మొత్తం ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. దీనికి ఆర్మీ ప్రాంతంలో బుల్కాపూర్ నాలాపై చెక్ డ్యాం నిర్మించడం ప్రధాన కారణం అని ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. అహ్మద్నగర్ డివిజన్లోని ఫస్ట్లాన్సర్ నుంచి వెళ్లే బుల్కాపూర్ నాలా విస్తరణ పనులను చేపట్టాలని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అధికారులకు సూచించారు. ఈ విషయాలపై ప్రభుత్వంతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటానని ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్, నానల్నగర్ కార్పొరేటర్ ఎండీ నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.