ఆరోగ్య హైదరాబాదే లక్ష్యంగా సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొవడంలో జీహెచ్ఎంసీ చర్యలు ఫలించాయి. కరోనా కట్టడిలో భాగంగా ప్రజలకు దోమలతో వచ్చే డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ‘ఆపరేషన్ దోమ’ పేరిట ప్రతి వారం 10 గంటలకు పది నిమిషాల పేరిట యాంటీ లార్వా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దవాఖానలు, విద్యాసంస్థలు, ఇంటి పరిసరాల శుభ్రతపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. డివిజన్ల వారీగా వార్షిక కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మూసీ పరివాహాక ప్రాంతాల్లో స్పెషల్ డోన్ల ద్వారా పిచికారీ చేపడుతున్నారు. ఎంటమాలజీ చీఫ్ రాంబాబు నేతృత్వంలో నిరంతరంగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా గతంలో కంటే మలేరియా, డెంగీ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.
కరోనా సమయంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకున్నది. ఎంటమాలజీ ఉద్యోగులు, కార్యకర్తలు గ్రేటర్వ్యాప్తింగా అంతటా దోమల లార్వాల నియంత్రణ మందులు పిచికారీ చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఆరోగ్య పరిరక్షణ, పరిసరాల పారిశుధ్య కార్యక్రమాలు అమలవుతున్నాయి. ప్రజలు ఇండ్లలో దోమకాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి ఆదివారం ‘ఉదయం 10 గంటలకు.. పది నిమిషాలు’ అనే నినాదంను విరివిగా ప్రచారం చేస్తున్నారు.
డెంగీ డేను పురస్కరించుకొని ‘డెంగీ నివారణను మన ఇంటి నుంచే మొదలు పెడదాం’ అనే నినాదంతో ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జోనల్, సర్కిల్, వార్డు కార్యాలయాల ముందు వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సీనియర్ ఎంటమాలజిస్ట్, సీనియర్ ఎంటమాలజిస్ట్, అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్లు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా, కరోనా కట్టడితో పాటు డెంగీ వంటి సీజనల్ వ్యాధులపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు హైదరాబాద్ జిల్లా మలేరియా అధికారి జి. నిరంజన్, మేడ్చల్ జిల్లా మలేరియా అధికారి సత్యం తెలిపారు.