కరోనా సెకండ్ వేవ్లో కేసుల పెరుగుదల ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో జీహెచ్ఎంసీ ‘వర్చువల్ సమావేశాల’ వైపు అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం, జోన్ల వారీగా ఆన్లైన్ సమీక్ష సమావేశాలతో జోన్లలోని ఆయా సమస్యలు తెలుసుకుని అత్యవసర పనులను సకాలంలో పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల చివరి వారంలో జీహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్ వర్చువల్ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవంగా జీహెచ్ఎంసీలో రూ.మూడు కోట్ల నుంచి ఆరు కోట్ల విలువైన పనుల్ని జీహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్ ఆమోదించాల్సి ఉంటుంది. తర్వాత ప్రభుత్వానికి నివేదించడం రివాజు. జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు ప్రతి మూడు నెలలకోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించాలి. ఐతే, కొత్త పాలక మండలి ఈ ఏడాది ఫిబ్రవరి 11న కొలువుదీరింది. దీంతో రెండు నెలలు గడిచిపోయాయి. జనరల్ బాడీ సమావేశం నిర్వహణకు సమయం ముంచుకొస్తుండటం, కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రమవుతున్న దృష్ట్యా ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోవడంతో ఈ నెల చివరి వారంలో వర్చ్యువల్ పద్ధతిలో నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మీ సోమవారం ‘మీడియా’ చిట్చాట్లో వెల్లడించారు.
పాలక మండలి సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నతాధికారులు వెరసి సాధారణంగా దాదాపు 200 మంది హాజరయ్యే సమావేశంలో భౌతిక దూరం పాటించడం కష్టసాధ్యం. వారి వెంట జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చే సహాయకులు, సెక్యూరిటీ సిబ్బంది వెరసి దాదాపు 500 మంది ఉంటారు. ఈ నేపథ్యంలోనే అందరికీ శ్రేయస్కరమైన విధానం వైపు అడుగులు వేస్తున్నారు. కాగా, ఈ సమావేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ ముసాయిదాపై ప్రధానంగా చర్చించనున్నారు. సమావేశంలో రూ.5,600 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసి అనుమతి కోసం ప్రభుత్వానికి పంపించనున్నారు. వీటితో పాటు చర్చించే పలు ఎజెండా అంశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.