కొండాపూర్, మార్చి 14: బహిరంగ ప్రదేశంలో చెత్తను పారవేస్తున్న పలువురికి శానిటేషన్ సిబ్బంది సరికొత్త శిక్షను విధించారు. స్వచ్ఛతను సాధించేందుకు ఎన్నో విధాలుగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొంత మంది చేస్తున్న పనులతో పరిస్థితులు మొదటికొస్తున్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధిలోని కొండాపూర్ డివిజన్ సిద్ధిక్నగర్లో బహిరంగ ప్రదేశంలో చెత్తను పారవేస్తున్న పలువురిని శానిటేషన్ సిబ్బంది వినూత్నంగా శిక్షించారు. చెత్తను వేసేందుకు వచ్చిన వారిని పట్టుకున్న సిబ్బంది గంట పాటు అక్కడే కూర్చోబెట్టారు. బహిరంగ చెత్తను పారవేయడంతో వచ్చే దుర్వాసనతో చుట్టు ప్రక్కల ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో వారికి తెలిసివచ్చేలా చేసేందుకే ఇలా వినూత్నంగా శిక్షించినట్లు శానిటేషన్ ఎస్ఆర్పీ కిరణ్ కుమార్రెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పారవేయడం మానుకుని జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెత్త తరలింపు ఆటోల్లోనే వేయాల్సిందిగా తెలిపారు. ప్రతి ఒక్కరూ శానిటేషన్ సిబ్బందికి సహకరిస్తూ స్వచ్ఛతను సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు.