సిటీబ్యూరో, సెప్టెంబరు 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్తో ఇతర దేశాల మధ్య ఉన్న సహకారం, సత్సంబంధాలు నిరంతరం కొనసాగాలని మేయర్ విజయలక్ష్మి కోరారు. శుక్రవారం నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిని జర్మనీ అంబాసిడర్ వాల్డర్ లిడ్నర్ బృందం, ఉజ్బెకిస్తాన్ అంబాసిడర్ దిల్షెడ్ అఖాతవ్, నాజర్ ప్రతినిధి బృందాలు మర్యాదపూర్వకంగా కలిశాయి. ఈ సందర్భంగా మేయర్ హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. అంతేకాక ఇక్కడి గ్రీనరి, పేదల ఇండ్లు, మహిళాభివృద్ధి, విద్య, వైద్యం, కాలుష్యం, ట్రాఫిక్పై వారికి అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్, ఇతర నగరాల్లో సిస్టర్ సిటీలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
హైదరాబాద్లోని చారిత్రక ప్రదేశాలైన చార్మినార్, గోల్కొండతో పాటు ఇక్కడి స్థానికుల వస్ర్తాధరణ విశిష్టంగా ఉన్నాయని జర్మనీ అంబాసిడర్ వాల్డర్ విడ్నర్ అన్నారు. హైదరాబాద్ను స్ట్రక్చర్ సిటీగా రూపాంతరం చేయాలని, టూరిజం హబ్ గా మార్చాలని చెప్పారు. అతి త్వరలో హైదరాబాద్లో జర్మనీ కాన్సులేట్ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీకి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
తెలంగాణ వైద్య విద్యార్థులు ఉజ్బెకిస్థాన్లో వైద్యవిద్యను అభ్యసిస్తున్నారని ఉజ్బెకిస్తాన్ అంబాసిడర్ దిల్షెడ్ అఖాతవ్ తెలిపారు. 2700 ఏళ్ల నాటి చారిత్రక ప్రదేశాలైన బుహార, సమార్ ఖాన్లతో తెలంగాణ రాష్ట్రంతో భాగస్వామ్యం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉజ్బెకిస్థాన్ పౌరులు ఇకడి సాంప్రదాయాలను ఇష్టపడతారని తెలిపారు.