ఉస్మానియా అరుణతార, కామ్రేడ్ జార్జిరెడ్డి 49వ వర్ధంతిని పురస్కరించుకుని పీడీఎస్యూ ఆధ్వర్యంలో జార్జి మిత్రులు, అభిమానులతో కలిసి మార్నింగ్వాక్ను బుధవారం ఘనంగా నిర్వహించారు. పీడీఎస్యూ నాయకులు దుబ్బ రంజిత్, నాగేశ్వర్రావు, రియాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ వాక్లో జార్జిరెడ్డి మిత్రుడు బూర్గుల ప్రదీప్ మాట్లాడుతూ 1970వ దశకంలో ఓయూలో నెలకొన్న అరాచక, ఆదిపత్య, మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి, విద్యార్థులలో విప్లవ భావాలు నూరిపోసిన మహోన్నతమైన వ్యక్తి జార్జిరెడ్డి అని కొనియాడారు. అప్పడి పరిస్థితులే నేడు నెలకొని ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కుల ఉన్మాదం, మతోన్మాదంపై తగు పద్ధతుల్లో విప్లవించాలని సూచించారు. అప్పుడు జార్జిరెడ్డి నడయాడి, మేథోమథనం చేసిన స్థలాలను వీక్షిస్తూ మార్నింగ్ వాక్ కొనసాగింది. ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ వాక్ ఇంజినీరింగ్ (కిన్నెర) హాస్టల్ వరకు కొనసాగింది. జీనా హైతో మర్నా సీఖో – కదంకదం పర్ లడ్నా సీఖో’ అని నాడు జార్జి ఇచ్చిన నినాదం ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమంలో మాజీ పీడీఎస్యూ నాయకులు భారత్ వేణుగోపాల్రెడ్డి, ఎస్ఎల్ పద్మ, కొండా నాగేశ్వర్, అశోక్, ఇనుప ఉపేందర్, హన్మేశ్, పీవీ శ్రీను, రమణ, అనురాధ పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జననం, పీడీఎస్యూ వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి మరణం ఒకేరోజు కావడం యాదృచ్ఛికమేనని, అయినా వారు విభిన్న ధృవాలు కాదని, వారి అంతిమ లక్ష్యం సమసమాజమని పీడీఎస్యూ అధ్యక్షుడు దుబ్బ రంజిత్ అన్నారు. అంబేద్కర్ 130వ జయంతి, జార్జిరెడ్డి 49వ వర్ధంతిని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆర్ఎన్ శంకర్, పాల్వాయి నగేశ్, సనుగుల రంజిత్, శరన్, మధు, పవన్ తదితరులు పాల్గొన్నారు.