కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీలు అప్రమత్తం అవుతున్నాయి. కరోనా వ్యాప్తిని నివారించే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, పాజిటివ్ వచ్చిన కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయి. వారికి కావాల్సినవి సమకూరుస్తూ తామున్నామనే భరోసా ఇస్తున్నాయి. పాజిటివ్ కేసులున్నా ఏ మాత్రం జంకకుండా కట్టడి వ్యూహాలతో ఒక్కటై ముందుకు కదులుతున్నాయి. వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తూ కరోనా రహిత కమ్యూనిటీలుగా నిలవాలని తాపత్రయపడుతున్నాయి. బయటి వారి రాకపోకలపై నియంత్రణ, రాత్రి వేళల్లో కర్ఫ్యూ లాంటి చర్యలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఇంటి పని, ఆయాలు, వంటవాళ్లు, డ్రైవర్లు, ఇతర పనివాళ్లు ఎవరైనా గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని అసోసియేషన్ సభ్యులు నిబంధనలు విధించారు. అంతేకాక వారి ఉష్ణోగ్రత పరీక్షించి సాధారణ స్థాయి ఉంటేనే లోనికి అనుమతి ఇస్తున్నారు. కొన్ని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు మాత్రం పనివారిపై ఆంక్షలు విధించారు. తప్పనిసరిగా పని వారు కావాలనుకుంటే మాత్రం ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ సమర్పించాలని నిబంధన పెట్టారు.
నిత్యావసరాల కోసం బయటికి వెళ్లకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న వారికి సెక్యూరిటీ సాయంతో డోర్ డెలివరీ చేయిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున మాత్రమే బయటికి వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకునేందుకు అనుమతిస్తున్నాయి.
గేటెడ్ కమ్యూనిటీలు కొవిడ్-19 నిబంధనలను కచ్చితంగా పాటించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నది. శానిటైజేషన్ కోసం జీహెచ్ఎంసీ హెల్ప్లైన్ నంబరు 040-42111111, శాంతి భద్రల కోసమైతే సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్లు 040-27853412, 040-27853418, 9490617100లను సంప్రదించాలని సూచించింది.
“మన గేటెడ్ కమ్యూనిటీలో కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. అయినా మరో 130 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో కమ్యూనిటీలో కొనసాగిస్తున్న కట్టడి విధానాలను మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నాం. ఈ విధానాలతో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా ప్రస్తుత పరిస్థితుల్లో సహకరించాలని కోరుతున్నాం. ఉదయం 6 నుంచి 8 గంటలు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు నిత్యావసరాలు తెచ్చుకోవాలి. బయటికి వచ్చే ప్రతిఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి.” – మై హోం జ్యువెల్ అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ మేనేజ్మెంట్ కమిటీ.
“ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలి. ఎంట్రెన్స్లో టెంపరేచర్ చెక్ చేశాకే లోపలికి అనుమతిస్తాం. ఏ ప్లాట్లో ఎవరికి పాజిటివ్ వచ్చింది? వారితో కాంటాక్ట్లో ఉన్నవారు ఎవరు? పాజిటివ్ వచ్చిన ప్లాట్లో పనిచేసే వారు మరే ఇతర ఫ్లాట్లలో పని చేశారా? లాంటి వివరాలతో కూడిన బులిటిన్ను ప్రతిరోజు విడుదల చేస్తాం. దీన్ని అనుసరించి మిగిలిన వారందరూ అప్రమత్తం కావాలి. ” – ప్రజయ్ గేటెడ్ కమ్యూనిటీ.