సికింద్రాబాద్, : గ్రేటర్ హైద్రాబాద్ను చెత్తరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులను, స్థానికులను భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతో ప్రణాళికను రూపొందించారు. ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్తవేయకుండా అందుకు కావాల్సిన సిబ్బందిని, ఆటోలను సమకూర్చిన ప్రభుత్వం అందుకనుగుణంగా ప్రజలను పూర్తిస్థాయిలో సహకరించడానికి బాధ్యతలను అప్పగించనున్నారు. ఇప్పుడున్న చెత్తకుండీలు, అక్కడక్కడా ఉన్న చిన్నచిన్న చెత్త డంపింగ్ ప్రాంతాలను పూర్థిస్థాయిలో తొలగించనున్నారు. కొన్ని చోట్ల రిక్షాలలో చెత్తను తీసుకువచ్చి డంపింగ్ కేంద్రంలో వేస్తున్నారు. వాటిని తొలగించనున్నారు. రోడ్లపక్కన ఎక్కడా కూడా చెత్త కనిపించని విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ గురువారం జీహెచ్ఎంసీకి ప్రత్యేకంగా చెత్త తరలించడం కోసం నూతన ఆటోలను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ పరిధిలోని సర్కిల్లకు ప్రస్తుతం 60 ఆటోలను కేటాయించనున్నారు. మరికొన్ని రోజుల్లో మరో 200 ఆటోలను ఈ సర్కిల్కు అందజేసే అవకాశముంది. ఈ ఆటోలలో తడి, పొడి చెత్తను వేరువేరుగా వేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి. అంతే కాకుండా ఆటోలో ఉన్న చెత్త కనిపించకుండా, కింద పడకుండా ఉండడం కోసం వాటికి డోర్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడపడితే అక్కడ చెత్తవేసే వారిని గుర్తించి వారి పేర్లు, చిరునామా నోట్ చేసిపెట్టుకుంటారు. మొదటిసారి చెత్తవేసేవారిని చైతన్యం చేసి వదిలేస్తారు. ఆ తరువాత కూడా ఎక్కడైనా చెత్తవేస్తే వారిపై ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు. కొన్నిసార్లు జరిమానా విధిస్తారు. మరికొన్నిసార్లు చెత్తవేసిన వారిచేతనే వేసిన చోటునుంచి చెత్తను తొలగింపజేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రజలు కూడా బాధ్యతాయుతంగా మారతారని అధికారులు భావిస్తున్నారు.
కార్పొరేటర్ల సహకారంతో..
ఎక్కడపడితే అక్కడ చెత్తవేసేవారిని గుర్తించడంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులతో పాటు జీహెచ్ఎంసీకి ఎన్నికైనా కార్పొరేటర్ల సహకారం కూడా తీసుకుంటారు. వారిని కూడా బాధ్యతాయుంగా విధులు నిర్వహించడంలో భాగస్వాములను చేయనున్నారు. ప్రతిరోజు ఉదయం కార్పొరేటర్లు కూడా అధికారులు, సిబ్బందితో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి చెత్త సమస్యకు చెక్ పెట్టనున్నారు. చెత్తను వేసే వారిని గుర్తించి వారిలో చైతన్యం తీసుకురావడం కోసం చర్యలు తీసుకుంటున్నారు.
చెత్తరహిత ప్రాంతాలుగా మారుస్తాం..
జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ పరిధిలోని ప్రాం తాలను చెత్తరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దడం కోసం చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చాం. మరికొన్ని రోజుల్లోనే రోడ్లపక్కన చెత్త కనిపించే పరిస్థితి లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. బండారు శ్రీనివాస్రెడ్డి, జోనల్ కమిషనర్ సికింద్రాబాద్