మత్తు పదార్థాల పీడను తొందరగా తొలిగించకపోతే మనం సాధిస్తున్న విజయాలు, వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉన్నది. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ అధికారులు తీవ్రంగా పరిగణించాలి. ఎంతో ఆవేదనతో నేను ఈ రోజు ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశాను.
పెడతోవ పట్టిన యువత వాట్సాప్లో గ్రూపులుగా ఏర్పడి, వాటిలో మేసేజ్లు చేసుకుంటూ గంజాయి తాగుతున్నారని నివేదికలు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గంజాయిని నిరోధించడానికి మీకేం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధం. గంజాయి మాఫియాను అణిచి వేయాలి, నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మత్తు సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి అవుతున్న గంజాయిని కట్టడి చేసేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
ఆన్లైన్, పాత నేరస్తుల వివరాలు సేకరిస్తూనే గంజాయి అమ్మకం, సరఫరా, వాడుతున్న వారిపై నిఘా పెట్టారు. రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న ఓలా, క్యాబ్ డ్రైవర్లపై దృష్టి సారిస్తున్నారు. శనివారం నగరంలో పలు చోట్ల పోలీసులు దాడులు జరిపరు.
ఎల్బీనగర్ పరిధిలోని 100 షాపుల్లో తనిఖీలు చేసి రూ.4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని 54 మందిని అరెస్ట్ చేశారు. ఎస్ఆర్ నగర్లో విదేశీ సిగరేట్లు, వసంత్నగర్, నానక్రాంగూడల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు ట్రైకమిషనరేట్ల పోలీసులు. ఠాణాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి..‘మత్తు’ వదిలిస్తున్నారు. రాష్ర్టాన్ని డ్రగ్స్ ఫ్రీగా మార్చాలని, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయడంతో పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. గంజాయి అమ్మేవారు, సరఫరా చేస్తున్నవారు, వాడుతున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. కొందరు గుట్కా, సిగరెట్లలోనూ గంజాయి ఉపయోగిస్తున్నట్లు నిఘాలో బయటపడుతుండటంతో అలాంటి వారి ఆటకట్టిస్తున్నారు. గతంలో ‘గుడుంబా’ వ్యాపారం చేసిగంజాయి దందాలోకి అడుగుపెట్టిన వారి భరతం పడుతున్నారు.
వివిధ చోట్ల దాడులు నిర్వహించి.. భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు. -సిటీబ్యూరో, అక్టోబర్ 23 హైదరాబాద్లో గంజాయి కన్పించవద్దంటే ముందు గా అది నగరంలోకి రాకుండా కట్టడి చేయాలని పోలీసులు ప్లాన్ చేశారు. నలుమూలలు, ఔటర్ రింగ్రోడ్డుపై పటిష్ట నిఘాను పెట్టారు. ఇటీవల సైబరాబాద్ పోలీసులు విశాఖపట్టణం పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు సాగించే వారి వివరాలను అక్కడి పోలీసులకు తెలపడంతో వారు 20 మంది ప్రధాన స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
కాగా, ఇప్పటి వరకు కేవలం గంజాయి రవాణా చేస్తున్న వాళ్లు, వారి నుంచి కొనుగోలు చేసిన వారు మాత్రమే పోలీసులకు దొరికిపోయారు. అయితే ఇక మూలాల నుంచి ‘మత్తు’ వదిలించాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో పాటు ఆన్లైన్ సేవలను కూడా దృష్టిలో ఉంచుకొని ఆహారం, ఇతర వస్తువులను సరఫరా చేసే సంస్థలు, రవాణా చేసే వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రవాణాలో కీలక పాత్ర వహిస్తున్న ఓలా, ఊబర్ వంటి క్యాబ్ డ్రైవర్లపైనా దృష్టిపెట్టారు.
గంజాయి, ఇతర డ్రగ్స్ను కూకటివేళ్లతో ఏరిపారేసేందుకు పోలీసులు పకడ్బందీ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. కమిషనరేట్లోని టాస్క్ఫోర్స్, సీసీఎస్, ఎస్వోటీలు, ఎస్బీ, ఆర్మూడ్ రిజర్వు ఫోర్స్, స్థానిక పోలీసులతో బృందాలను ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బంది డ్రగ్స్ను అణిచివేయడంలో మరింత పటిష్టంగా పనిచేసేందుకు వాళ్లకు పోలీస్ కమిషనర్లు దిశా నిర్దేశం చేస్తున్నారు. మరో వైపు గంజాయి విక్రయదారులు తమ బుద్ధి మార్చుకోకుంటే పీడీ యాక్టులు విధిస్తున్నారు.
గంజాయి లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం తరువాత పోలీస్స్టేషన్ల వారీగా బృందాలను ఏర్పాటు చేశాం. ఐదేండ్ల కిందట నుంచి గంజాయి, ఇతర డ్రగ్స్ దందా చేసిన వారి వివరాలు, జైలు నుంచి బయటకు ఎప్పుడొచ్చారు… ఇప్పుడేం చేస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నాం. రిపీటెడ్ అఫెండర్లపై పీడీయాక్టులు పెడుతున్నాం. పది రోజుల్లో గంజాయి కేసుల్లో అరెస్టయిన ఏడుగురు నిందితులపై పీడీ యాక్టు ప్రయోగించాం.
మరో 13 మందిపై కూడా విధించేందుకు సిద్ధమవుతున్నాం. గుట్కా విక్రేయదారులు కూడా గంజాయి దందాలోకి వచ్చారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నాం. దూల్పేట్, షాహినాయథ్గంజ్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఓలా, ఊబర్, స్విగ్గీ, జుమాటో ఇతర ఆన్లైన్ సేవలపై, నగరంలో 9 ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలపై నిఘా పెట్టాం. అందరం సమన్వయంతో పనిచేసి..హైదరాబాద్తో పాటు రాష్ర్టాన్ని డ్రగ్స్ ఫ్రీగా మార్చేస్తాం. – అంజనీకుమార్, నగర పోలీస్ కమిషనర్