ఖైరతాబాద్, ఆగస్టు 29: గంగ పుత్రుల ఆరాధ్య దైవం ‘గంగమ్మ తెప్పోత్సవం’ నేత్ర పర్వంగా సాగింది. పీవీ నరసింహారావు మార్గ్లోని గంగమ్మ గుడి వద్ద వేలాది మంది భక్తజనం అమ్మవారిని స్మరిస్తూ దూప, దీప నైవేద్యాలను సమర్పించగా, సాగర తీరం పులకరించింది. తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గంగా తెప్పోత్సవ వేడుకలను రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తొలుత ఖైరతాబాద్లోని ఏడుగుళ్ల వద్ద బోనాలను నెత్తిన పెట్టుకొని రెండు వేల మంది ఆడపడుచులతో నిర్వహించిన యాత్ర శోభాయమానంగా సాగింది.
గంగ తెప్ప (జల పందిరి) తో గంగపుత్రులు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల వి న్యాసాలు, ఒగ్గుడోలు, కోలాటాల నృత్యాలతో ఖైరతాబా ద్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు అధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, చేపల వేట వృత్తిగా జీవనం సాగిస్తున్న గం గపుత్రులకు గంగమ్మ తల్లితో విడదీయని అనుబంధం ఉందన్నారు. మమ్మల్ని చల్లంగా చూడమంటూ తెప్పోత్స వం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ అధ్యక్షులు మల్కు మహేందర్ బాబు నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో ఖైరతాబాద్, ముషీరాబాద్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు, కార్పొరేటర్ పి.విజయా రెడ్డిలు పాల్పంచుకొని అమ్మవారిని కొలిచారు. కమిటీ ప్రధాన కార్యదర్శి పూస నర్సింహా, ఉపాధ్యక్షులు మంగళపల్లి రాజు, మామిడి సురేశ్ బాబు, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు జయసింహా, పూస మురళీ, చందు, నర్సింగ రావు, పాశం సుధాకర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.