మారేడ్పల్లి, మే 14: సికింద్రాబాద్ గణపతి ఆలయంలో దొంగలు పడ్డారు.. రెండు హుండీలను పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా, లాక్డౌన్ కారణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న సికింద్రాబాద్ గణపతి ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదు. ఆలయం ముందు ఇద్దరు సెక్యూరిటీగార్డులు కాపలాగా ఉన్నారు. శుక్రవారం ఉదయం సెక్యూరిటీగార్డులు రెండు హుండీల తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించి.. ఆలయ ఈఓ అంజనీదేవికి సమాచారం అందించారు. వెంటనే ఆమె ఆలయానికి చేరుకొని పరిశీలించి.. పోలీసులకు సమాచారం అందించారు.. పోలీసులు.. క్లూస్ టీంతో ఆలయానికి వచ్చి పరిశీలించారు. సుమారు 50 వేల నుంచి రూ.1 లక్ష వరకు నగదు పోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఆలయ ఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు.. అందులో గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మసీదుకు అనుకొని ఉన్న ప్రహరీ గొడ ఎక్కి.. ఆలయం మొదటి అంతస్తులోకి వచ్చాడు. ఆలయంలో 15 హుండీలు ఉండగా వాటిని ఆలయం వెనుక వైపునకు తీసుకెళ్లి.. రెండు హుండీలను పగులగొట్టి.. అందులోని నగదును తీసుకుని శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో బయటకు వెళ్లిపోయినట్లు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.