వీధులు జనసంద్రమయ్యాయి. జనం సాగర బాట పట్టారు. ఇసుక వేసినా రాలనంతగా ట్యాంక్ బండ్ దారులు కిక్కిరిశాయి. కాషాయ ధ్వజాలు సగౌరవంగా రెపరెపలాడగా.. నవరాత్రులు మహా వైభవంగా పూజలందుకున్న తీరొక్క రూపాల గణనాథులు సంతృప్తిగా కదలి శోభాయాత్రకు తరలివచ్చాయి. జై బోలో గణేశ్ మహారాజ్కి జై.. గణపతి బొప్పా మోరియా.. అంటూ భక్తుల నినాదాలు మిన్నంటాయి. బూరల శబ్ధాలు, డప్పు దరువులు, తీన్మార్ నృత్యాలతో యువత కోలాహలం విశేషంగా ఆకట్టుకుంది.
అనుకున్నట్టుగానే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మధ్యాహ్నం 3:23 గంటలకు పూర్తయింది. మహాగణపతి నిమజ్జనం సాగర్లో ఇదే చివరి సారి కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. బాలాపూర్ గణపతి శోభాయాత్ర పాతనగరం మీదుగా సాగర్కు శోభాయమానంగా సాగింది. దారి పొడవునా అశేష భక్తజనం నీరాజనం పలికారు. నిమజ్జనానికి తరలివచ్చిన విశేష ఆకృతుల్లో ఉన్న గణనాథులు భక్తులను ఆకట్టుకున్నాయి. బైబై గణేశా.. అంటూ భక్తులు వీడ్కోలు పలికారు. మళ్లీ రావయ్య గణనాథ అంటూ వేడుకున్నారు. భక్తుల కోసం ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్ ప్రత్యేక సేవలందించాయి.
ఖైరతాబాద్ మహా గణేశుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, నిర్వాహకులు పటిష్టమైన ఏర్పాట్లు చేసి శోభాయాత్రను నిర్వహించారు. ఎన్టీఆర్ మార్గ్లోని 4వ నంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ మహా గణేశుడి విగ్రహాన్ని మధ్యాహ్నం 3:23 గంటలకు నిమజ్జనం చేశారు.
గడిచిన ఏడాది కరోనా మహమ్మారి విజృంభించడంతో గణేశ్ ఉత్సవాలకు విరామం ప్రకటించారు. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వం ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఆదివారం జరిగిన నిమజ్జనంలో లక్షలాది మంది భక్తుల్లో మంచి జోష్ కనిపించింది. కాకపోతే అందరినీ కలిచివేసిన విషయం.. అత్యధిక మంది కొవిడ్ నిబంధనలకు తిలోదకాలివ్వడం. సాధారణంగా ఇలాంటి ఉత్సవాల్లో భౌతిక దూరం పాటించడమనేది కష్ట సాధ్యమే.
మాస్కు ధరించడం వల్ల మహమ్మారి ప్రభావం వ్యాపించకుండా అడ్డుకట్ట వేయడం సులువు. ఆదివారం జరిగిన వినాయక శోభాయాత్రలో అత్యధిక మంది మాస్కు లేకుండానే కనిపించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా శోభాయాత్రలో మాత్రం కొవిడ్ నిబంధనలను అత్యధిక మంది పాటించకపోవడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో ప్రతిష్టించిన గణనాథులను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేశారు. లాల్దర్వాజ, అఫ్జల్గంజ్, బేగంబజార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, చాదర్ఘాట్, కాచిగూడ, మలక్పేట, దిల్సుఖ్నగర్, మెహిదీపట్నం, ఆసిఫ్నగర్, మల్లేపల్లి, మాసబ్ట్యాంక్, విజయనగర్ కాలనీ, కార్వాన్, మంగళ్హట్, సికింద్రాబాద్, కూకట్పల్లి, అంబర్పేట, రామంతాపూర్, విద్యానగర్, నల్లకుంట తదితర ప్రాంతాల నుంచి వేలాది విగ్రహాలు ఊరేగింపుగా ట్యాంక్బండ్కు చేరుకున్నాయి.