మా బొజ్జ గణపయ్యా.. పూజలందుకోవయ్యా… మా చిట్టి గణపయ్యా.. విఘ్నాలు తొలగించయ్యా.. అంటూ నవరాత్రులు అఖండ పూజలందుకొని నిమజ్జనానికి పయనమయ్యాడు. కరోనా నుంచి భక్తజనులకు ఊరటనిస్తూ తల్లిఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. నిమజ్జనం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 9 గంటలకు బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమై 17 కిలోమీటర్లు సాగి హుస్సేన్సాగర్కు చేరుకోనుంది. ఈ ఒక్క మార్గంలోనే 27 వేలమందితో భారీ భద్రతను సమకూర్చుతున్నారు.
గ్రేటర్వ్యాప్తంగా 60 వేల విగ్రహాలు ఉండగా, హుస్సేన్సాగర్లో 45 వేల ప్రతిమలు నిమజ్జనం కానున్నాయి. మహా వేడుక నేపథ్యంలో బల్దియా, జలమండలి, పోలీసు, వైద్యారోగ్యశాఖ, రవాణా, ఆర్టీసీ, తదితర విభాగాలు అన్ని వసతులు కల్పించడంలో నిమగ్నమయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 320 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుంది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూంలతోపాటు నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కరోనా పరీక్షలతోపాటు టీకాలు కూడా వేయనున్నారు.
నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు నగరవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఇతర జిల్లాల నుంచి బస్సులు, లారీలు, ఇతర వాహనాలను నగరంలోకి అనుమతించరు. జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల్ని శివార్లకే పరిమితం చేయనున్నారు.
గణేశ్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధుల్లో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నారు.
సాధారణంగా ఆఖరి మెట్రో రైలు రాత్రి 10.15 గంటలకు బయల్దేరుతుంది. నేడు నిమజ్జనం నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి. గమ్యస్థానాలకు 2 వరకు చేరుకుంటాయి. అలాగే 565 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. అదనంగా 8 ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నారు.
వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా శోభాయాత్ర జరిగే ప్రాంతాలతో పాటు విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ శిబిరాలలో కరోనా నిర్ధారణ పరీక్షలతో పాటు కొవిడ్ టీకా కూడా వేయనున్నారు. నగర వ్యాప్తంగా మొత్తం 15వైద్య శిబిరాలను ఏర్పాటు చేయగా అందులో 7 ప్రధాన వైద్య శిబిరాలు ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వివరించారు. ట్యాంక్బండ్, మెహిదీపట్నం, మోజంజాహి మార్కెట్, ఎన్టీఆర్ మార్గ్, అంబర్పేట్, చార్మినార్, నాంపల్లి, అబిడ్స్, అంబర్పేట్, నల్గొండ ఎక్స్రోడ్ తదితర ప్రాంతాల్లో వైద్యశిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
ప్రతి శిబిరం వద్ద ఒక అంబులెన్స్ చొప్పున 15అంబులెన్స్లను, మరో మూడు అంబులెన్స్లను అదనంగా అందుబాటులో ఉంచినట్లు డా.వెంకటి తెలిపారు. అంతే కాకుండా సమాచారం, సిబ్బంది సమన్వయం కోసం మొత్తం 10 చోట్ల కమాండ్ కంట్రోల్రూమ్లను ఏర్పాటు చేశామని, అందులో ఒకటి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటుందన్నారు.
గణేశ్ మహా నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలపై పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్రలు రెండు రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఆదివారం ఉ. 6 గంటల నుంచి సోమవారం సా. 6 గంటల వరకు మద్యం, కల్లు అమ్మకాలు జరుపొద్దని, వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలను మూసి వేయాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్లు హెచ్చరించారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 ( నమస్తే తెలంగాణ ) : నిమజ్జన విధుల్లో భాగంగా రవాణాశాఖ అధికారులు గణనాథుల తరలింపునకు 1200 వాహనాలను మండపాల నిర్వాహకులకు సమకూర్చారు. అందులో భాగంగా అన్నీ ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో సంబంధిత ఆర్టీవోల సమక్షంలో వాహనాలను అప్పగించారు. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగనాయక్ ఆర్టీఏ పరిధిలో ఉన్న నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. నిమజ్జన ఉత్సవంలో 100 మంది హోంగార్డ్స్, 10 మంది ఆర్టీవోలు, ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు విధుల్లో ఉంటారని తెలిపారు. గణనాథుల ఆకారం ఆధారంగా లారీలు, ట్రక్కులు, ట్రాలీలు, ట్రాక్టర్లు ఇలా అన్ని రకాల వాహనాలను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాల అవసరం ఏర్పడినా కూడా వాహనాలను సమకూర్చుతామని జేటీసీ తెలిపారు.
గణేశ్ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 19న అర్ధరాత్రి తర్వాత కూడా ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు తెలిపారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 565 ప్రత్యేక బస్సులపై ‘గణేశ్ నిమజ్జనం స్పెషల్’ పేరుతో బోర్డు పెట్టనున్నారు. ఆర్టీసీలో ప్రయాణించే భక్తులకు సమస్యలు ఉంటే రేతిఫైల్ బస్స్టేషన్లో 9959226154, కోఠి బస్స్టేషన్లో 9959226160 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ట్రాఫిక్ క్లియరెన్స్కు బండ్లగూడ డిపో మేనేజర్ వి. మల్లయ్య (9959226087), మిధాని డిపో మేనేజర్ టీ. కిషన్రావు (9959226139) అందుబాటులో ఉండనున్నారు. ఈ ఇద్దరు అధికారులు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు విధుల్లో ఉంటారని జోన్ అధికారులు తెలిపారు.