సిటీబ్యూరో, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ): నగరంలో ఆదివారం వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంతంగా.. వైభవంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నగరంపై పోలీసు విభాగం డేగకన్ను వేసింది. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 39 వేల మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కమాండ్ అండ్ కంట్రోల్ (సీసీసీ)కు అనుసంధానమైన సీసీ కెమెరాలతో క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్, హుస్సేన్సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన 275 సీసీ కెమెరాలను కూడా సీసీసీకి అనుసంధానం చేసి.. పర్యవేక్షించారు.
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల కార్యాలయాల్లోని ప్రధాన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) నుంచి సీపీలు అంజనీకుమార్, మహేశ్భగవత్, స్టీఫెన్ రవీంద్రతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అదనపు సీపీ శిఖా గోయెల్, సెంట్రల్ జోన్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్ తదితర అధికారులు బడాగణేశ్ నిమజ్జనోత్సవం పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో సుమారు 35 చోట్ల ప్రత్యక్షంగా వీక్షించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయం నుంచి కమాండ్ కంట్రోల్ ద్వారా, సరూర్నగర్ చెరువు వద్దకు చేరుకుని నిమజ్జనాన్ని పరిశీలించారు. ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి 23 చెరువుల వద్ద ఉన్న పరిస్థితులను వీక్షించారు. మరోవైపు పాత నేరస్తులు, పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్ల కదలికలను కూడా పర్యవేక్షించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండి.. నిమజ్జనం ప్రశాంతంగా సాగేలా పోలీస్ యంత్రాంగం విశేష కృషి చేసింది.
బషీర్బాగ్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న కూడలి ప్రధాన జంక్షన్గా మారింది. విగ్రహాల ర్యాలీకి కొద్ది సేపు అనుమతిస్తూ, మరికొద్ది సేపు సాధారణ వాహనాలకు అనుమతించారు. బషీర్బాగ్ పై వంతెన వద్ద చెట్టు అడ్డం రావడంతో బాలాపూర్ నుంచి వచ్చిన విగ్రహానికి ఇబ్బంది ఏర్పడింది. వాహనాన్ని వెనక్కి తీసి.. వంతెన పక్క నుంచి సాధారణ రూట్లోకి మళ్లించారు.
సాంకేతికతకు పెద్దపీట వేస్తూ హైదరాబాద్ పోలీసులు గణేశ్ నిమజ్జనోత్సవాన్ని నగర పోలీస్ కమిషనరేట్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. హుస్సేన్సాగర్లో నిమజ్జనానికి వచ్చిన విగ్రహాల లెక్కలను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఉండే సిబ్బంది ఆన్లైన్లో అప్డేట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ తయారు చేశారు. ప్రతి గంటకు హుస్సేన్సాగర్లోని ట్యాంక్బండ్, ఎన్టీఆర్మార్గ్, సంజీవయ్యపార్కు, జలవిహార్ ప్రాంతాల్లోని క్రేన్ల వద్ద నిమజ్జనం జరిగిన విగ్రహాల లెక్కను అక్కడ ఉండే సిబ్బంది అప్లోడ్ చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విగ్రహాలతో పాటు ఐదు జోన్ల నుంచి వచ్చిన వాటిని ఆదివారం ఉదయం నుంచి నిమజ్జనం జరిగే వరకు లెక్కించారు. రాత్రి 7 గంటల వరకు నిమజ్జనానికి విగ్రహాల రాక నెమ్మదిగా ఉంది. ఆ తరువాత వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది.
నిమజ్జనోత్సవంలో పోకిరీల ఆగడాలకు షీటీమ్స్ చెక్ పెట్టింది. మొత్తం 50 కేసులు నమోదు చేశారు. బడాగాణేశ్ ర్యాలీ, ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్కు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాతో 20 షీ టీమ్స్ బృందాలు పనిచేశాయి. మహిళలను, యువతులను ఆటపటించే ఆకతాయిలను ఈ బృందాలు కొంతమందిని రెడ్ హ్యాండెండ్గా పట్టుకున్నాయి.