సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): గాంధీ ప్రాణవాయువుకు భరోసానిస్తున్నది. సొంతంగానే ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నది. ఇందు కోసం దవాఖానలో ఎనిమిది ప్లాంట్లను ఏర్పాటు చేయగా, అవి రోజుకు 7.5 టన్నులు ఉత్పత్తి చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 5 నుంచి 6 టన్నుల ఆక్సిజన్ మాత్రమే అవసరమయ్యేది. సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో రోజూ 30 టన్నులు అవసరమైందని, 1200 నుంచి 1300 మందికి అందించామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో 20 నుంచి 23 టన్నులు మాత్రమే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. గతంలో రోగులకు సరిపడా అక్సిజన్ అందించగలిగినప్పటికీ కొన్ని సందర్భాల్లో బ్యాకప్ లేకపోవడంతో ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సి వచ్చేదన్నారు. ప్లాంట్ల ఏర్పాటుతో ఆ సమస్య తీరిందన్నారు. థర్డ్వేవ్ వచ్చినా ఇబ్బందులు ఉండవని అభయమిస్తున్నారు.
గాంధీలో మొత్తం ఎనిమిది ప్లాంట్లు ఉండగా, హెట్రో ల్యాబ్స్, దివిస్ ల్యాబ్, అరబిందో ఫార్మా, నాట్కో ల్యాబ్, ఎస్ఎంఎస్, ఎంఎస్ఎన్ ల్యాబ్ తదితర ఫార్మా కంపెనీలు ఆరింటిని ఏర్పాటు చేశాయి. ఇక పీఎం కేర్స్ తరఫున రోజుకు 2.8 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ప్లాంట్ను నెలకొల్పారు. వీటితో పాటు 20వేల లీటర్ల సామర్థ్యం ఉన్న లిండె ప్లాంట్ ఉన్నది. మొత్తంగా ఎనిమిది ప్లాంట్ల ద్వారా రోజుకు 7.5 టన్నులు ఉత్పత్తి జరుగుతుందని, ఇది సుమారు రోజుకు 300 మంది రోగులకు సరిపోతుందని సూపరింటెండెంట్ తెలిపారు. వీటిని బ్యాకప్ ఉండటం వల్ల క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ట్యాంకర్లు వచ్చే వరకు రోగులకు ఆక్సిజన్ స్థాయిలు పడిపోవన్నారు.