బన్సీలాల్పేట్, అక్టోబర్ 20 : గాంధీ దవాఖానలో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్ప అగ్ని ప్రమాదం జరిగి కేబుల్ వైర్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదు. బుధవారం ఉదయం దవాఖానలోని గ్రౌండ్ ఫ్లోర్ మహిళల టాయిలెట్స్, లిఫ్టుల పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్యానల్ బోర్డుల నుంచి మంటలు చెలరేగాయి. కేబుల్ వైర్లు కాలుతూ దట్టమైన పొగ, మంటలు వచ్చి.. అవి మొదటి, రెండో, మూడో అంతస్తు వరకు వ్యాపించాయి. అక్కడ ఉన్న సెక్యూరిటి సిబ్బంది, ఎలక్ట్రికల్ విభాగం సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమై వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
వైద్యశాల ఆవరణలోనే ఉన్న సైఫాబాద్ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పొగలు వ్యాపించడంతో గ్రౌండ్ ఫ్లోర్లోని ప్రసూతి వార్డులోని గర్భిణులు, మహిళలు ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. దవాఖానలో మూడు బ్లాకులు ఉండగా, సూపరింటెండెంట్ కార్యాలయం ఉన్న నార్త్ బ్లాక్లోనే మాత్రమే రోజంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోగులకు ఇబ్బంది కలుగకుండా నార్త్ బ్లాక్లో ఉన్న ఆర్థోపెడిక్, ఈఎన్టీ, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ మెడిసిన్ విభాగంలో ఉన్న రోగులను సౌత్ బ్లాక్ల్లోని పలు వార్డులకు తరలించారు.
మిగిలిన వార్డులు, అత్యవసర సేవలు, ఆపరేషన్లు, బయటి రోగుల సేవలు యథావిధిగా కొనసాగాయి. ఘటనా స్థలాన్ని డీఎంఈ డాక్టర్ కె.రమేశ్ రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే.హేమలత, టిఎస్ఎంఐడిసీ విద్యుత్ ఇంజినీర్ల విభాగం అధికారులు సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని, రోగులను పక్కనే ఉన్న సురక్షిత వార్డుల్లోకి తరలించామని చెప్పారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా, ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో ఫోన్లో మాట్లాడారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.