సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ), బన్సీలాల్పేట : నగరంలో పారిశుధ్యం, పరిశుభ్రతకే అధికంగా ప్రాధాన్యత ఇవ్వాలని మహా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. గ్రేటర్లో పారిశుధ్య కార్యక్రమాల పరిశీలనకు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక పర్యటనలు చేపడుతున్నారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, అధికారులతో కలిసి ఆమె పలు ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. బేగంపేటలోని కూకట్పల్లి నాలాను పరిశీలించి అక్కడ పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని మేయర్ చెప్పారు. నాలా సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పికెట్ నాలా వద్ద కంటోన్మెంట్ వాసులతో మేయర్ మాట్లాడారు. అంబేద్కర్ నాలాతో ఎదురవుతున్న సమస్యలను స్థానిక కార్పొరేటర్ సుచిత్ర మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. మోండా మార్కెట్లో కోటి 90 లక్షల రూపాయలతో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. చెత్తను నాలాల్లో, రోడ్లపై వేయవద్దని ప్రజలకు మేయర్ విజ్ఞప్తి చేశారు. బన్సీలాల్పేట శ్మశాన వాటిక సమస్యలను పలువురు స్థానికులు మేయర్ దృష్టికి తీసుకు రాగా, త్వరలో సమస్యలను పరిష్కరిస్తానని వారికి మేయర్ హామీ ఇచ్చారు. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్లో బస్తీ దవాఖానలో కరోనా టెస్టింగ్ సెంటర్, ఓపీ సేవలను మేయర్ పర్యవేక్షించారు. రోడ్డు నం.10లో జరుగుతున్న సీవరేజీ పనులను పరిశీలించారు. అనంతరం, క్యాంపు కార్యాలయం వద్ద షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.