సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ ) : వ్యర్థాలను నిల్వ ఉంచొద్దని మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. గ్రేటర్లో రెండో రోజు బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆమె.. పారిశుధ్య కార్యక్రమాల అమలును పరిశీలించారు. షేక్పేట కొత్త చెరువులోని డెబ్రీస్, గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ను ఆదేశించారు. షేక్పేట కాలనీలో చెత్తను తొలగించాలని ఎస్ఎఫ్ఏ, ఏఎంవోహెచ్ను ఆదేశించారు. యూసుఫ్గూడలోని కమలాపురికాలనీలో పేరుకుపోయిన వ్యర్థాలను తీసివేయాలని సూచించారు. సోమాజిగూడలో నాలాలో పూడిక తీత పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. వెంగళ్రావునగర్లో రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను తీసేసి.. అక్కడ ఫుట్పాత్ పనులు చేపట్టాలన్నారు. రహమత్నగర్లో పలు ప్రాంతాల్లో తిరిగిన మేయర్.. నాలా పెండింగ్ పనులను పూర్తి చేయాలని చెప్పారు. వినాయకరావునగర్ పీహెచ్సీ కేంద్రాన్ని సందర్శించి ఫీవర్ సర్వే, వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్పొరేటర్లు పాల్గొన్నారు.