గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపు ఖాయమైంది. అక్టోబర్ 1 నుంచి విజయవాడ హైవేపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం లాజిస్టిక్ పార్క్లో పండ్ల విక్రయాలు జరగుతాయని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి పద్మ హర్ష వెల్లడించారు. ప్రస్తుతమున్న గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ప్రాంతంలో ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
దీనికి సంబంధించి కసరత్తు శరవేగంగా సాగుతోంది. 44 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన బాటసింగారం లాజిస్టిక్ పార్క్లో పండ్ల విక్రయాల కోసం షెడ్లు, నిల్వ చేసేందుకు గోదాములు, రైతుల విశ్రాంతి కోసం ప్రత్యేక భవనం, పెట్రోల్బంక్, బ్యాంకు, ఏటీఎం కేంద్రాలు, పోలీసు ఔట్పోస్ట్ను ఏర్పాటు చేశారు. అంతేకాదు దూరప్రాంతాల నుంచి పండ్ల వాహనాలు నేరుగా బాటసింగారం చేరేందుకు చక్కటి రవాణా సౌకర్యం ఉంది.
గడ్డి అన్నారంలో కొనసాగుతున్న పండ్ల మార్కెట్ ఇక బాట సింగారంలో ఏర్పాటు కానున్నది. విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నారు. బాటసింగారం సమీపంలో ఏర్పాటు చేసిన లాజిస్టిక్ పార్కును సైతం ఈ మార్కెట్కు కేటాయించారు. అక్టోబర్ 1 నుంచి ఈ మార్కెట్లో క్రయ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో బాటసింగారంలో ఏర్పాటు చేస్తున్న పండ్ల మార్కెట్లో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారు. 44 ఎకరాల విస్తీర్ణంలోని లాజిస్టిక్ పార్కులో ఈ నూతన పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రూ.90 లక్షలతో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. క్రయవిక్రయాల కోసం లక్ష ఎస్ఎఫ్టీల సామర్థ్యం గల గోదాములను వినియోగించనున్నారు.
మామిడి సీజన్లో మరో నాలుగు ఎకరాల్లో తాత్కాలికంగా గోదాములు నిర్మించేందుకు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. అంతేకాక వివిధ రాష్ర్టాలతో పాటు వివిధ దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ మార్కెట్కు మామిడి పండ్లు దిగుమతి అవుతుండటంతో మార్కెట్ పక్కనే ఉన్న మరో 8 ఎకరాల స్థలం లీజుకు తీసుకొని ప్రత్యేకంగా గోదాములు ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక మార్కెట్లో పార్కింగ్ సౌకర్యంతో పాటు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా నాలుగు లేన్ల రోడ్డును అందుబాటులోకి తెచ్చారు.
బాటసింగారంలో ఏర్పాటు చేస్తున్న మార్కెట్తో అటు రైతులు, ఇటు వ్యాపారులకు తిప్పలు తప్పనున్నాయి. ప్రస్తుతం గడ్డి అన్నారం మార్కెట్లోకి రాత్రి సమయంలోనే వాహనాలకు అనుమతి ఉండేది. ఉదయం 8 గంటల తర్వాత వచ్చిన వాహలన్నీ రాత్రి 10 గంటల వరకు నగరం బయటనే ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం బాటసింగారం మార్కెట్కు వచ్చేందుకు రవాణా ఆంక్షలు లేవు. ఎక్కడి నుంచైనా.. ఏ సమయంలోనైనా సరుకును మార్కెట్కు తేవచ్చు. బెంగళూరు, ముంబయి, విజయవాడ, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారు నేరుగా ఔటర్రింగ్రోడ్డు మీదుగా పెద్ద అంబర్పేట ఎగ్జిట్ వద్ద దిగి పండ్ల మార్కెట్కు చేరుకునే అవకాశం ఉంది.
నూతన పండ్ల మార్కెట్ను అక్టోబర్ 1న ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం గడ్డి అన్నారం నుంచి కార్యకలాపాలు
నిర్వహిస్తున్న వ్యాపారులంతా అక్టోబర్ 1 నుంచి బాట సింగారం మార్కెట్ నుంచి లావాదేవీలు నడపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రస్తుతం గడ్డి అన్నారం మార్కెట్ కంటే బాటసింగారంలో ఏర్పాటు చేసిన మార్కెట్లో అత్యాధునిక వసతులు ఉండటంతో వ్యాపారులు అక్కడికి వెళ్లేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
బాట సింగారం పండ్ల మార్కెట్లో ప్రస్తుతం లక్ష ఎస్ఎఫ్టీల సామర్థ్యం గల గోదాములు ఉన్నాయి. ఇందులో 50 వేల ఎస్ఎఫ్టీల్లో అతి పెద్ద గోదాం, మిగిలిన స్థలంలో చిన్న గోదాములు ఉన్నాయి. క్రయ విక్రయాలు జరిపేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించారు. అలాగే రైతుల రెస్ట్ రూంతో పాటు పరిపాలన భవనాన్ని ఏర్పాటు చేశారు. పండ్ల ఎగుమతులు, దిగుమతి చేసుకునేందుకు ఎనిమిది ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
బాటసింగారంలో ఏర్పాటు చేస్తున్న నూతన పండ్ల మార్కెట్లో సకల సౌకర్యాలు కల్పించాం. రైతులు, హమాలీలు, కమిషన్ ఏజెంట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గడ్డి అన్నారం మార్కెట్కు ఉదయం వచ్చే వాహనాలపై నిషేధం ఉండేది. కొత్త మార్కెట్కు అలాంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైనా రావచ్చు. సరుకును అమ్ముకొని పోవచ్చు. అక్టోబర్ 1 నుంచి రైతులు, కమీషన్ ఏజెంట్లు, హమాలీలు బాటసింగారంలోనే తమ లావాదేవీలను కొనసాగించాలి. – కందాడి ముత్యంరెడ్డి, చైర్మన్
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ను బాటసింగారం లాజిస్టిక్ పార్క్కు తరలిస్తున్నాం. అక్టోబర్ 1 నుంచి అక్కడ సేవలు మొదలవుతాయి. నూతనంగా ఏర్పాటవుతున్న మార్కెట్లో అనేక వసతులు కల్పిస్తున్నాం. గడ్డి అన్నారం మార్కెట్లో అనేక ఇబ్బందులు ఉండేవి. బాటసింగారంలో సేవలు మొదలు కాగానే ఆర్టీసీ బస్సులతో పాటు కార్గో సేవలను అందుబాటులోకి తెస్తాం. వ్యాపారులతో పాటు సాధారణ ప్రజలకు ఇది ఎంతో ఉపయోక్తంగా ఉంటుంది. పద్మ హర్ష , గడ్డిఅన్నారం
వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి