ఎంతో గౌరవప్రదంగా జరగాల్సిన అంత్యక్రియల విషయంలోనూ జరుగుతున్న దోపిడీ ఆగిపోనుంది. అప్పటికే తమవారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి శ్మశానంలో కాసుల వేట అంతులేని వేదన మిగులుస్తున్నది. కడుపు కోతతో అల్లాడుతున్న వారి నుంచి కాసులు దండుకునే దందాకు జీహెచ్ఎంసీ చెక్ పెట్టింది. ఇకపై అంతిమ సంస్కారానికి గరిష్ఠంగా రూ.8 వేలు మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు.. ప్రతి శ్మశాన వాటికలో ధరల పట్టిక పెట్టడంతోపాటు… తీసుకున్న డబ్బుకు రశీదు కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఎక్కడైనా సరే అధిక చార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేసేందుకు టోల్ఫ్రీ నంబర్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది బల్దియా.
సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ ): ఓ వైపు కరోనా కల్లోలం సృష్టిస్తున్నా కొందరు కాసుల వేటను వదలడం లేదు. కుటుంబ సభ్యులను కోల్పోయి కడుపు కోతతో అల్లాడుతున్న వారి కన్నీటిని సైతం పిండుకుని జేబులు నింపుకుంటున్నారు.. మృతదేహం కాలాలంటే రెండింతల చార్జీలు తప్పడం లేదు.. మానవత్వం మరచి, అవకాశవాదంలో అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో కొవిడ్తో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి…శ్మశానవాటికల్లో జరుగుతున్న అడ్డగోలు దందాకు శాశ్వతంగా చెక్పెట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అంతిమ సంస్కారానికి గరిష్టంగా 8వేలు మాత్రమే తీసుకోవాల్సి ఉండగా.. కొందరు కాటికాపరులు రూ.12 నుంచి రూ.16వేల వరకు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం గ్రేటర్లోని అన్ని శ్మశానవాటికల్లో జోనల్ కమిషనర్లు శనివారం ఆకస్మిక పర్యటనలు చేశారు. దహన సంస్కారాలకు సంబంధించిన చార్జీల పట్టిక (ప్లెక్సీలు)ను ఏర్పాటు చేశారు. అంతేకాక కాటికాపరులకు బిల్లు బుక్కులు అందజేశారు. కచ్చితంగా నిబంధనలను పాటించాలని లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దహన సంస్కారాలకు అధిక చార్జీలు వసూలు చేసినా, ఇతర ఫిర్యాదులున్నా 040-2111 1111కు కాల్ చేయాలని ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు.