బంజారాహిల్స్,ఆగస్టు 31 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంచినీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జలమండలి అధికారులను ఆదేశించారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జలమండలి అధికారులతో తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ..మంచినీటి సరఫరాలో ఇబ్బందులతో పాటు మురుగు సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు నిధులు మంజూరు చేశామన్నారు. రెండుమూడురోజుల్లో పనులు ప్రారంభించనున్నామని పేర్కొన్నారు.
బోరబండ డివిజన్ పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నాలుగురోజుల్లో శంకుస్థాపనలు చేస్తామని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని ఎమ్మెల్యే మాగంటి అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా మల్లారం పంప్ హౌజ్లో వరదనీరు రావడంతో సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించిన వెంటనే నీటి పరఫరా పూర్తిస్థాయిలో జరుగుతుందని జలమండలి అధికారులు తెలిపారు.
సమావేశంలో జలమండలి డివిజన్-6 జీఎం హరిశంకర్, డీజీఎమ్ దిలీప్కుమార్తో పాటు ఎర్రగడ్డ,ఎస్పీఆర్ హిల్స్, జూబ్లీహిల్స్, వెంగళరావునగర్, ఎల్లారెడ్డిగూడ వాటర్ వర్క్స్ మేనేజర్లు హాజరయ్యారు.