సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలోని జలమండలి వినియోగదారులు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకానికి క్యాన్నంబర్లను నమోదు చేసుకోవాలని జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు. ఈ పథకం గడువును ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ వరకు పెంచిందని ఆయన తెలిపారు. బుధవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉచిత నీటిపథకం అమలుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎండీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ ఉచిత నీటి పథకానికి నేటి వరకు అనుసంధానించుకోని వినియోగదారుల వెంటనే క్యాన్ నంబర్లతో ఆధార్ అనుసంధానం చేయించుకోవాలన్నారు. ఈ పథకాన్ని నమోదు చేసుకొని రిబేటు పొందేలా అధికారులు వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు.
నమోదు చేసుకున్న రోజు నుంచే రిబేటు వర్తిస్తుందని ఎండీ స్పష్టం చేశారు. ఉచిత నీటి పథకం నమోదుపై ప్రచారంలో క్షేత్రస్థాయి సిబ్బందితో సహా, జీఎంలు డీజీఎంలు, మేనేజర్లు, ఎమ్మెల్యే, కార్పొరేటర్ వంటి ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రచారంలో భాగంగా కరపత్రాలు, పోస్టర్లతో పాటు సామాజిక మాద్యమాల ద్వారా ప్రచారం కల్పించాలన్నారు. వినియోగదారులు తమతమ క్యాన్ నంబర్లను ఆధార్ నంబర్తో అనుసంధానించుకునేందుకు దగ్గరలోని మీ సేవా కేంద్రాలను సందర్శించాలని, లేదా జలమండలి వెబ్సైట్ www.hyderabadwater. gov.inను సందర్శించి అనుసంధానించుకోవచ్చన్నారు. మరింత సమాచారం కోసం జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313ని సంప్రదించాలన్నారు. అనంతరం ఎండీ బోర్డు రెవెన్యూ, వర్షాకాల ప్రణాళిక అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఈఎన్సీ, ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మిరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ వీ.ఎల్.ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్-2 ఎం.స్వామి తదితరులు పాల్గొన్నారు.