ఉపాధి, వాణిజ్య కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్న భాగ్యనగరం శరవేగంగా విస్తరిస్తున్నది. నివాసయోగ్యత, రవాణా మెరుగుపడడంతో శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వెలిశాయి. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ వరకే తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలి ఔటర్ లోపల గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిరంతరం తాగునీటినందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జలమండలి అధికారులు రూ.1200 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తక్షణమే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించడంతో టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టనున్నారు. గ్రేటర్ అవతల, ఔటర్ లోపల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని 190 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఇప్పటికే రూ.756.56 కోట్లతో 70 మిలియన్ లీటర్ల సామర్థ్యమున్న 164 రిజర్వాయర్లు నిర్మించి, 1600 కి.మీ పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
శివార్లలో పెరుగుతున్న జనాభాకనుగుణంగా సమృద్ధిగా నీటిని అందించాలన్న సర్కారు ఆదేశంతో వాటర్బోర్డు సర్వే నిర్వహించి నివేదిక రూపొందించింది. ప్రధానంగా 137 మిలియన్ లీటర్ల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు 2093 కిలోమీటర్ల పైప్లైన్ వేయాలని, ఇందుకు రూ.1200 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. రోజురోజుకూ విస్తరిస్తున్న హైదరాబాద్ మహా నగరంలో తాగునీటి వ్యవస్థను సైతం అందుకు అనుగుణంగా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. గ్రేటర్ ప్రజలకు నిండు వేసవిలోనూ తాగునీటి సమస్య లేకుండా కృష్ణా, గోదావరి జలాలను శుద్ధి చేసి సమృద్ధిగా అందిస్తుంది.
ఈ నేపథ్యంలో గ్రేటర్ అవతల… ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని 190గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఇప్పటికే రూ.756.56 కోట్లతో 70 మిలియన్ లీటర్ల సామర్థ్యం ఉన్న 164రిజర్వాయర్లు నిర్మించి 1600 కిలోమీటర్ల పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే శివారులో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు పెద్ద ఎత్తున వెలిశాయి. దీంతో వీటికి సమృద్ధిగా నీటిని అందించేందుకు చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గతంలోనే ప్రభుత్వం జలమండలిని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు సర్వే నిర్వహించి, నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో ప్రధానంగా 137మిలియన్ లీటర్ల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టాలని నివేదికలో పేర్కొన్నారు. దాదాపు 2093 కిలోమీటర్ల మేర పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఇంటింటికీ నల్లా కనెక్షన్ అందించాలని అందులో స్పష్టం చేశారు. ఇందుకు రూ.1200 కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు.
శివారులో మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేయడంపై మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం అధికారులు సమర్పించిన రూ.1200 కోట్ల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శివారులోనూ పుష్కలంగా తాగునీరు అందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను కూడా ఆదేశించారు. దీంతో అధికారులు ఈ పనులకుగాను టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టనున్నారు.