సిటీబ్యూరో, జూలై 30 (నమస్తేతెలంగాణ) : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సెలూన్లు (నాయీ బ్రాహ్మణులు), లాండ్రీ షాపులకు (రజకులు) నెలకు 250 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా సరఫరా చేస్తామని, ఈ ఏప్రిల్ నుంచే వర్తిస్తుందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ప్రత్యేక మెమో జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వచ్చిందని, అప్పటి నుంచి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బీసీ సంక్షేమ శాఖ ఈ పథకం లబ్ధిదారులను గుర్తించే పనిలో ఉన్నదని.. బిల్లులు చెల్లించడం లేదని ఆయా దుకాణాల కరెంటు కనెక్షన్లు తొలగించొద్దని, సరఫరా నిలిపి వేయొద్దని క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది.