చిక్కడపల్లి : ప్రస్తుత కాలంలో కంప్యూటర్ నాలెడ్జి ఎంతో అవసరం. పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యనందించడానికి నియోకర్సర్ సొసైటీ ఐదేండ్లుగా సేవలు అందిస్తుంది. పేదలకు కంప్యూటర్ విద్యనందించడానికి 2016 లో సొసైటీ ఆధ్వర్యంలో జస్టిస్ చల్లా కొండయ్యా నాలెడ్జి సెంటర్ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ను బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ప్రారంభించారు. మార్కెట్లో చదువును కొనలేని వారికి విద్యను అందుబాటులోకి తీసుకురావడం, మెళకువలు నేర్చుకున్న వారికి స్వయం ఉపాధి, ఉద్యోగం ఏదో ఒకటి సాధించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా మొత్తం 8750 మందికి శిక్షణ ఇచ్చారు.
పేద విద్యార్థులకు కంప్యూటర్ బేసిక్స్ను ఉచితంగానే అందిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్ టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ నేర్పిస్తున్నారు. ఇప్పటి వరకు 3758 మంది లబ్ధిపొందారు. కంప్యూటర్ బేసిక్స్పై ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో నిరుద్యోగులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మల్టీమీడియా, యాండ్రాయిడ్, వెబ్, డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, ఇంటీరియల్ డిజైనింగ్, ప్రాక్టికల్ అకౌంటెన్సీ, జీఎస్టీతో కూడా ట్యాలీ లాంటి కోర్సులకు మార్కెట్లో భారీ ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో నియోకర్సర్లో మాత్రం నాలుగోవంతు ధరకే ప్రమాణాలతో అందిస్తున్నది. ఇందులో 1651 మంది శిక్షణ పొందగా 1352 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ప్రతికోర్సు పూర్తయిన తరువాత ప్రాక్టికల్స్ చేయిచడం ద్వారా స్వయం ఉపాధి, ఉద్యోగాల సాధనలో విద్యార్థులకు తోడ్పడింది. మల్టీమీడియా నేర్చుకున్న విద్యార్థులతో యూట్యూబ్ ఛానెళ్లను ఏర్పాటు చేయిచింది. మార్కెట్లో అవకాశాలను పరిచయం చేసేందుకు హైదరాబాద్ ఫెస్ట్లో భాగంగా ఫొటో గ్రఫీ కాంపెటీషన్ను, షార్ట్ ఫిలీం ఫెస్ట్ను నిర్వహించింది.