కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 10: ఆర్థిక స్థోమత లేని చిన్నారులకు ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందించనున్నట్లు కెయిన్ జాన్ నెట్వర్క్ డాక్టర్ సుధా సిన్హా అన్నారు. కూకట్పల్లిలోని శివానంద రిహాబిలిటేషన్ సెంటర్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శివానంద ఇంప్యాక్ట్ పెడియాట్రిక్ట్ క్యాన్సర్ కేర్’ను డాక్టర్ సుధా సిన్హా ఆదివారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ సమాజంలో ఎందరో పేద చిన్నారులు క్యా న్సర్ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థిక స్థోమత లేక సరైన వైద్య సేవలు పొందలేకపోతున్నారన్నారు. ఇలాంటి చిన్నారులకు శివానంద ఇంప్యాక్ట్ పెడియాట్రిక్ క్యాన్సర్ కేర్లో ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. సెంటర్లో ప్రస్తుతం, 15 బెడ్లతో అత్యాధునిక వసతులు కల్పించడం జరిగిందని, భవిష్యత్లో 50 బెడ్లతో సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కేర్ వైద్యశాల ఆంకాలజీ డాక్టర్ కొప్పాక దీపక్, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.