కొండాపూర్, జూలై 3: భూముల సారాన్ని తగ్గించకుండా దిగుబడి పెంచేందుకు దోహదపడే నానో డీఏపీ ఎరువును గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ (హెచ్సీయూ) పరిశోధకులు అభివృద్ధి చేశారు. పంట దిగుబడి పెంచేందుకు కొన్నేండ్లుగా వాడుతున్న రసాయన ఎరువులతో భూమి నిస్సారమవుతున్నది. హరిత విప్లవం మొదలైనప్పటి నుంచి అధిక దిగుబడికి ఎరువుల వాడకం పెరుగుతూ వస్తున్నది. ఎరువుల తయారీకి నైట్రోజన్ (ఎన్), పాస్ఫరస్ (పీ), పొటాషియం (కే) వినియోగిస్తున్నారు. పాస్ఫరస్ ప్రకృతిలోనే సరిపడినంత ఉన్నది. ఎరువుల వాడకంలో ఈ మూలకాన్ని అధికంగా వినియోగిస్తుండటంతో రానున్న 100 -200ల ఏండ్లలో ఈ మూలకం అంతమయ్యే పరిస్థితి ఉన్నది. ఈ సమస్యను అధిగమించేందుకు హెచ్సీయూ ఇం టర్నేషనల్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్సీఐ) విభాగం ప్రొఫెసర్ రాహుల్కుమార్ బృందం కొత్తగా పారిశ్రామిక పద్ధతిలో నానో- డైమ్మోని యం ఫాస్పేట్ (ఎన్-డీఏపీ)నుతయారు చేసిం ది. ఇప్పుడున్న ఎరువులతో టమాట, గోధుమ విత్తనాల అభివృద్ధిపై పరిశోధన నిర్వహించారు. ఇందులో కన్వెన్షనల్ గ్రాన్యులర్ డీఏపీ (సీ-డీఏపీ)తో పోల్చితే నానో-డీఏపీ ఎరువుతో మొక్కలు ఆరోగ్యంగా పెరిగాయి. ఈ ఎరువులతో మొక్కల పెంపకంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ బృందంలో నౌరెమ్ రోనాల్డ్ రీగన్సింగ్, హరిత, శ్రీధర సుధాకరశర్మ, నరసింగరావు ఉన్నారు.