శేరిలింగంపల్లి, మార్చి 4 : ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ముఠాలోని ఇద్దరు సభ్యులను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.6లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్, ఇందిరాపురానికి చెందిన సర్వేశ్సాహు అలియాస్ అశోక్కుమార్ సింగ్(32) ఏంబీఏ చదివాడు.. తనకుతాను ఢిల్లీకి చెందిన అశోక్కుమార్గా చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ విజయవాడ, సనత్నగర్కు చెందిన ఇంజినీరింగ్ చేసిన అబ్దుల్మజీద్ అలియాస్ శ్రీనివాస్(26)తో పాటు ఢిల్లీకి చెందిన మిశ్రా, కోల్కత్తాకు చెందిన దినేశ్తో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించడానికి నిరుద్యోగులకు కేంద్ర రైల్వేశాఖతో పాటు ఇతర కేంద్ర ప్రభు త్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేయాలనుకున్నారు.
ఈ క్రమంలో విజయవాడకు చెందిన శ్రీనివాస్ ఫేస్బుక్, వాట్సాప్ సామాజిక మాధ్యమాల ద్వారా నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను బ్యాక్డోర్లో ఇప్పిస్తానంటూ నమ్మించాడు. ఇతడి మాటలు నమ్మిన కొంతమంది అతడు అడిగినట్లు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇచ్చారు. డబ్బులు అందిన వెంటనే ఈ ముఠా రైల్వే డిపార్టుమెంట్ పేరుతో నకిలీ జాబ్ ఆఫర్ లెటర్లు, ఐడీ కార్డులు సృష్టించి ఇచ్చారు. ఆ తర్వాత మెడికల్ టెస్టుల పేరిట డబ్బులు తీసుకుని.. ఢిల్లీలోని రైల్వే దవాఖానలో బాధితులకు మెడికల్ టెస్టులు సైతం చేయించి.. మూడు నెలల శిక్షణ పేరిట మరికొంత నగదును వసూలు చేశారు.. ఇలా.. బాధితుల నుం చి రూ. 6.3లక్షల వరకు వసూలు చేశారు. ఇంకా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో ఓ బాధితుడు గత నెల 15న శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టి.. ముఠాలోని ప్రధాన నిందితులు అశోక్కుమార్ సింగ్, శ్రీనివాస్ను గురువారం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు మిశ్రా, దినేశ్లు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.6 లక్షల నగదుతోపాటు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేస్తున్నారు. బ్యాక్డోర్లో ఉద్యోగాల పేరిట మోసం చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ నిరుద్యోగులకు సూచించారు.