సిటీబ్యూరో, మార్చి 15(నమస్తే తెలంగాణ): యూకే స్టాక్ మార్కెట్ తో పాటు గుర్రం పందాల్లో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు అందిస్తామంటూ నమ్మించిన సైబర్నేరగాళ్లు నగరవాసికి రూ. 20 లక్షలు టోకరా వేశారు.. ఈ కేసులో జార్ఖండ్కు చెందిన కీలక నిందితుడిని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. నల్లకుంటకు చెందిన వ్యక్తి 25 ఏండ్లుగా స్టాక్ మార్కెట్లో క్రయ విక్రయాలను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి మొదటి వారంలో నరేంద్రకుమార్ పేరుతో ఓ వ్యక్తి వాట్సాప్లో యూకే నంబర్తో అతడికి మెసేజ్ పెట్టాడు. యూకే స్టాక్ మార్కెట్లో రోజువారీగా ట్రేడింగ్ చేసేందుకు రూ. 25 లక్షలు పెట్టుబడి పెడితే.. 15 శాతం నెలకు లాభాలు ఇస్తామంటూ నమ్మించి… రూ. 20 లక్షలు అతడితో పెట్టుబడిగా పెట్టించాడు. కేవలం స్టాక్ మార్కెట్పైనే కాకుండా గుర్రం పందాల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తామని.. దాంతో భారీ లాభాలు వస్తాయం టూ నమ్మించాడు. ఇందులో కూడా డబ్బు డిపాజిట్ పెట్టించిన తరువాత నేరగాడు సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశాడు.. ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ నవీన్ బృందం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టింది.
దర్యాప్తులో బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా నేరం జరిగింది జార్ఖండ్ నుంచి అని సైబర్క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ నవీన్ నేతృత్వంలో ప్రత్యేక బృందం జార్ఖండ్కు వెళ్లింది. అక్కడ బొకారో స్టీల్ సిటీలో నివాసముండే శివమ్ శాంతన్ సింగ్ లాడ్బ్రోకర్స్.కామ్ పేరుతో ఒక వెబ్సైట్ను తయారు చేసి.. దాన్ని అమెరికా నుంచి ఆపరేట్ చేస్తున్నాడు.. యూకేకు చెందిన నంబర్తో వాట్సాప్లో బాధితులతో మాట్లాడి.. వెబ్సైట్తో బాధితులను ఆకర్షిస్తూ వచ్చిన వాళ్లకు భారీ లాభాలిస్తానంటూ నమ్మి స్తూ భారీ మోసాలు చేస్తున్నాడని గుర్తించారు. డబ్బుల డిపాజిట్కు నాగేందర్, సునీతాకుమారికి చెందిన బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తూ.. బాధితులకు యూకే లో ఉన్నట్లు వాట్సాప్తో చాటింగ్ చేస్తూ పెట్టుబడుల రూపంలో డబ్బు లు డిపాజిట్ చేయిస్తున్నాడని తేల్చారు. ఇలా నల్లకుంటకు చెందిన బాధితుడి వద్ద నుంచి రూ. 20,13,800 వసూలు చేశాడు. బాధితుడికి హామీ ఇచ్చినట్లు లాభాలు ఇవ్వకపోవడంతో, పెట్టుబడి పెట్టిన డబ్బు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నేరగాడు తమ సెల్ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశాడు. ఈ మేరకు జార్ఖండ్లో ప్రధాన నిందితుడైన శివమ్ శాంతన్ సింగ్ను అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. నిందితుడు బాధితుల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బులను విలాసాలకు ఉపయోగించడంతో పాటు స్కైలైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని మిగతా నిందితులైన నాగేందర్, సునీతాకుమారిల కోసం గాలింపు చేపట్టారు.