అంబర్పేట, జూన్ 4: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయింది కేవైసీ అప్డేట్ చేయండంటూ ఓ వ్యక్తికి మెసేజ్ రాగా అతను వివరాలు అప్డేట్ చేసిన వెంటనే అకౌంట్లో నుంచి రూ.51,500 మాయమైన సంఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. డీఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్కు చెందిన వై.గోపీకృష్ణకు శుక్రవారం 9432655469 సెల్ నుంచి మీ అకౌంట్ క్లోజ్ అయింది. వెంటనే కేవైసీ అప్డేట్ చేయండని మెసేజ్ వచ్చింది. ఇది చదివిన వెంటనే కేవైసీతో పాటు యూజర్ ఐడీ, పాస్వర్డ్ను అప్డేట్ చేశాడు. కొద్ది సేపటికే రూ.40వేలు అకౌంట్ నుంచి డెబిట్ అయ్యాయని మెసేజ్ వచ్చింది.
కొద్ది సమయం తరువాత అదేనంబర్ నుంచి కాల్ వచ్చింది. మీ అకౌంట్ నుంచి డెబిట్ అయినటువంటి రూ.40వేలు రెండు గంటల్లో అకౌంట్కు క్రెడిట్ అవుతాయని కాల్ మాట్లాడిన వ్యక్తి చెప్పి మళ్లీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ను అప్డేట్ చేయ్యాలని చెప్పాడు. గోపీకృష్ణ మళ్లీ అప్టేడ్ చేశాడు. అప్పుడు అతని ఫోన్కు మళ్లీ ఏటీఎం నుంచి రూ.11.500 డెబిట్ అయ్యాయని మెసేజ్ వచ్చింది. ఇది చూసుకున్న గోపీకృష్ణ వెంటనే రాంనగర్లోని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లి తనకు వచ్చిన మెసేజ్ల గురించి ఆరా తీయగా, తాము ఎలాంటి మెసేజ్ పంపించలేదని బ్యాంకు అధికారులు చెప్పారు. అప్పుడు తాను మోసపోయానని గుర్తించి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.