సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే బోనస్గా కోల్మైన్ షేర్లు ఇస్తామంటూ ఓ వృద్ధుడిని నమ్మించి, ఆరేండ్లుగా కోటి రూపాయలు మోసం చేసిన సైబర్ నేరగాళ్ల ముఠాలో ఓ నేరస్తుడిని ఢిల్లీలో హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగాపూర్లో నివాసముండే బాధితుడు 2015లో అస్సోం రాష్ట్రం గౌహతిలో ఉన్నాడు. ఆ సమయంలోనే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటూ నమ్మించిన నేరగాళ్లు.. పాలసీలు తీసుకుంటే షేర్లు అందిస్తామంటూ రూ.80 లక్షలు, పాలసీల పేరుతో రూ.20 లక్షలు వసూలు చేశారు.
ఈ వ్యవహారం నడుస్తుండగానే బాధితుడు హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్కు వచ్చిన తరువాత కూడా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మరికొంత డబ్బు లాగేశారు. మోసం చేస్తున్నారని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులోని ప్రధాన సూత్రధారిని సైబర్క్రైమ్ పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.
ఓటీపీ, రిమోట్ యాప్లను వేసుకోమని నమ్మిస్తూ అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠాను ఛత్తీస్గఢ్ దేవగఢ్లో సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు నిందితులను అక్కడి పోలీసులు వేర్వేరు కేసుల్లో అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్పై దేశ వ్యాప్తంగా నేరాలు ఉన్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఈ గ్యాంగ్పై 10కి పైగా కేసులు ఉన్నాయి.