సిటీబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ): అమెరికా వీసా స్లాట్స్ బుకింగ్ చేస్తూ డబ్బులు తీసుకుంటున్న ఇద్దరు యువకులకు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అమెరికాకు వెళ్లే వారి వీసాల దరఖాస్తు కోసం అమెరికన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ ద్వారా ఇద్దరు విద్యార్థులు వీసాల కోసం దరఖాస్తు చేసి, వేర్వేగా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇంటర్వ్యూలు చేసే సమయంలో.. తాము ఆన్లైన్లో స్వయంగా దరఖాస్తులు పూరించలేదని, వేరే వ్యక్తులు తమకు సహాయం చేశారని, వారే స్లాట్ బుక్ చేశారని, ఇందుకు ఒకరు రూ. 2 వేలు, మరొకరు రూ. 3 వేలు తీసుకున్నారంటూ ఆ విద్యార్థులు కాన్సులేట్ అధికారులకు చెప్పారు.
దీంతో, నిబంధనలకు విరుద్ధంగా కొందరు తమ వెబ్సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసి, దరఖాస్తులు నింపుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో కొన్ని రోజుల కిందట అమెరికన్ కాన్సులేట్ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్లాట్ బుక్చేసి, దరఖాస్తు ఫారాలు నింపిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తేజ, కృష్ణ జిల్లాకు చెందిన వాసి ప్రభాకర్ను గుర్తించిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు.
తాము ఎలాంటి నేరం చేయలేదని, తాము బీటెక్ పూర్తి చేసి, గూగుల్ క్రోమ్లో ఉండే అలర్ట్ వ్యవస్థను వాడుకుంటున్నామని చెప్పారు. తాము స్లాట్ బుక్ చేసి, దరఖాస్తు ఫారాన్ని నింపినందుకు కొంత డబ్బు తీసుకుంటామని, ఎక్కడా పొరపాటు చేయలేదని, హ్యాకింగ్ వంటి ఘటనలకు పాల్పడలేదని ఆ యువకులు పోలీసులకు వివరించారు. దీంతో కన్సులేట్ అధికారులను కూడా సైబర్క్రైమ్ పోలీసులు పిలిపించారు. యువకులు చెప్పిన విషయాన్ని తెలుసుకున్న కాన్సులేట్ అధికారులు, వెబ్సైట్ను నిబంధనలకు విరుద్ధంగా యాక్సెస్ చేయడం లేదని తెలుసుకున్నారు. దీంతో సైబర్క్రైమ్ పోలీసులు ఆ ఇద్దరు యువకులు తేజ, ప్రభాకర్కు నోటీసులు జారీ చేశారు.