సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): మీ హెర్బల్ ఫార్ములా మాకు నచ్చింది.. ఫార్ములా ఇస్తే మీకు రూ.5 కోట్లు ఇస్తామంటూ నమ్మించి నగరానికి చెందిన ఓ హెర్బల్ డాక్టర్కు రూ. 41 లక్షలు టోకరా చేసిన ఆఫ్రికన్ సైబర్ నేరగాడిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం.. మెహిదీపట్నంకు చెందిన హెర్బల్ డాక్టర్కు రెండేండ్ల కిందట జేమ్స్ మరియో వాట్సాప్ ద్వారా పరిచయమై, ఆమెతో తరచూ మాట్లాడుతూ సలహాలు, సూచనలు తీసుకున్నాడు. డాక్టర్ వద్దనున్న హెర్బల్ ఫార్ములాను విక్రయించాలని కోరుతూ.. రూ. 5 కోట్లు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. డబ్బును డాక్టర్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తున్నానంటూ నమ్మించాడు.
మరుసటి రోజు తాము ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని, మీ బ్యాంకు ఖాతాలోకి విదేశాల నుంచి రూ.5 కోట్లు డిపాజిట్ అయ్యాయని, దీనిపై అనుమానాలు ఉన్నాయంటూ బెదిరించి, చార్జీలు చెల్లించాల్సి ఉందంటూ డాక్టర్ నుంచి రూ. 26 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఎవరైతే డబ్బులు పంపించారో వారు వచ్చి సంతకం చేస్తేనే మీ ఖాతాలోకి డబ్బు డిపాజిట్ అవుతుందంటూ చెప్పారు. దీంతో లండన్ నుంచి మాట్లాడుతున్నాని చెప్పిన జేమ్స్ మరియోను రావాలంటూ బాధితురాలు కోరింది.
రెండు రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులమంటూ.. జేమ్స్ మరియో భారీ విదేశీ కరెన్సీతో పట్టుబడ్డాడని చెప్పి కస్టమ్స్ క్లియరెన్స్, పన్నుల పేరుతో రూ. 15 లక్షలు వసూలు చేశారు. అనుమానం వచ్చిన బాధితురాలు ఇది మోసమని గ్రహించి సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కృష్ణ బృందం దర్యాప్తు చేపట్టింది. హెర్బల్ డాక్టర్ను మోసం చేసిన పశ్చిమ ఆఫ్రికా కోటి డిల్వోరి దేశానికి చెందిన మెస్సీ దన్హో ఫ్రాంక్గా గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ల్యాప్టాప్, మూడు సెల్ఫోన్లు, 37 బ్యాంకు ఏటీఎం కార్డులు, 13 పాస్ పుస్తకాలు, 12 చెక్బుక్లు స్వాధీనం చేసుకున్నారు.