సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ):భారీగా లాభాలు ఇప్పిస్తామని నమ్మించి.. మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని గురువారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ముంబైకి చెందిన మయూర్ శరత్ హథ్కర్, వినోద్కుమార్ శర్మ వాట్సాప్ ద్వారా కొంత మందిని పరిచయం చేసుకుని.. వారి పరిచయాన్ని విస్తృతం చేసుకున్నారు. ఇలా వారి వాట్సాప్ గ్రూపులో చేరిన వారందరికీ.. తాము బంగారం, వెండిలపై ట్రేడింగ్ నిర్వహిస్తామని.. మీరు పెట్టుబడి పెడితే కొద్ది రోజుల్లోనే భారీగా లాభాలను ఇప్పిస్తామని నమ్మించారు. ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి పరిచయమవ్వగా, వారు బాధితుడికి వెబ్లింక్స్ను ఇచ్చారు. అది తెరవడానికి యూజర్ఐడీ, పాస్వర్డు ఇచ్చారు.
ఆ తర్వాత దాదాపు రూ.8.50 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. మరుసటి రోజు పెట్టుబడికి భారీ లాభమంటూ అతని పేజీలో వర్చ్యువల్గా చూపించారు. వెంటనే వచ్చిన లాభాన్ని విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా, విత్డ్రా ఆప్షన్ కనిపించలేదు. బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన అధికారులు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి ఖాతాలను ఫ్రీజ్ చేసి.. దాదాపు రూ.12 లక్షలను జప్తు చేశారు. విచారణలో ఈ ఇద్దరు ముంబైకి చెందిన డీజీ వాల్యూషన్స్ సంస్థలో పని చేస్తున్నారని, అమాయకులను మోసం చేయడానికే ఈ కంపెనీను ఏర్పాటు చేశారని తేలింది. కంపెనీ నిర్వాహకులు ఫిలిప్ చాన్, విజయ్లు ప్రధాన సూత్రధారులని పోలీసులు తేల్చారు.