సిటీబ్యూరో, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): తమ స్కీమ్లో పెట్టుబడి పెడితే రెండు రోజుల్లోనే పెట్టిన దానికి రెట్టింపు వస్తుందంటూ నమ్మించి యూసుఫ్గూడకు చెందిన ఓ యువకుడికి సైబర్ నేరగాళ్లు రూ.10.5 లక్షలు టోకరా వేశారు. ప్రైవేట్ సంస్థలో సిస్టమ్ ఆపరేటర్గా పనిచేస్తున్న బాధితుడికి ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తమ స్కీమ్లో సభ్యుడిగా చేరాలంటూ వాట్సాప్లో ఒక లింక్ను పంపించారు. ఆ లింక్ క్లిక్ చేయడంతో ఓ వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. అందులోకి వెళ్లి వెయ్యి రూపాయలు పెట్టుబడిగా పెట్టడంతో మరుసటి రోజు అది రెండు వేలు అయ్యింది. ఆ డబ్బును డ్రా చేసుకున్న బాధితుడు ఇదంతా నిజమని నమ్మాడు.
మళ్లీ కొంత డబ్బు పెట్టడంతో అది కూడా తిరిగి వచ్చేసింది. దీంతో తెలిసిన వారు, స్నేహితుల వద్ద అప్పుగా తీసుకొని వారం రోజుల్లో రూ.10.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. మొదట లక్ష పెట్టుబడి పెట్టగానే స్క్రీన్పై మరుసటి రోజు రెట్టింపు డబ్బు కన్పించింది. కాని వాటిని డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా పోవడంతో, అన్ని ఒకేసారి డ్రా అవుతాయంటూ నిర్వాహకుల నుంచి సమాధానం వచ్చింది. దీంతో లక్షల రూపాయలు అందులో పెట్టుబడి పెడుతూ వెళ్లాడు. తీరా రూ.10.5 లక్షలు పెట్టుబడి పెట్టిన తరువాత ఆ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.