కొండాపూర్, ఏప్రిల్ 27 : వ్యాపారం చేద్దామని నమ్మించి.. రూ.85లక్షలు తీసుకుని.. తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడిన ఇద్దరిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హెచ్సీయూ సమీపంలోని ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో నివాసం ఉండే ఆరె లక్ష్మీ నర్సింహారెడ్డి.. ఖాజాగూడలో నివాసం ఉండే సింధూర రెడ్డితో తనకు గండిపేట సమీపంలో రూ. 100 కోట్ల విలువ చేసే 4 ఎకరాల భూమి ఉందని, అందులో వ్యాపారం చేద్దామని అన్నాడు. అందులో స్విమ్మింగ్పూల్, పబ్, గేమ్ జోన్లను ఏర్పాటు చేద్దామని.. సింధూర రెడ్డి నుంచి నగదు, చెక్ల రూపంలో రూ.85లక్షలను తీసుకున్నాడు. కాగా.. ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో లక్ష్మీ నర్సింహారెడ్డిని తన డబ్బు తిరిగి ఇవ్వాలని సింధూర రెడ్డి కోరింది. దీంతో డబ్బులు తిరిగి ఇవ్వకపోగా మట్ట జయంతి గౌడ్ అనే సామాజిక కార్యకర్తతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. లక్ష్మీనర్సింహారెడ్డి, జయంతి గౌడ్లను అరెస్ట్ చేశారు.