అతడి పేరు తరుణ్. సాఫ్ట్వేర్ ఉద్యోగి. కొవిడ్ పరిస్థితుల మూలంగా కుటుంబాన్ని సొంతూరుకు పంపించాడు. ఇక అప్పటి నుంచి అతడు ఆన్లైన్ ఫుడ్పైనే ఆధారపడ్డాడు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్.. రాత్రి డిన్నర్ ఇలా తనకు నచ్చిన ఆహారాన్ని ఆరగిస్తున్నాడు. నెల రోజులుగా అతడిది ఆన్లైన్ ఫుడ్ బాటే.. ఒక్క తరుణే కాదు.. నగరంలోని చాలా మంది ఇప్పడు ఆన్లైన్ ఫుడ్కు జై కొడుతున్నారు. లాక్డౌన్లోనూ ఈ కామర్స్కు సడలింపులు ఇవ్వడంతో గతంతో పోలిస్తే ఫుడ్ ఆర్డర్స్ రెట్టింపు పెరిగాయి. ఏ సమయంలోనైనా ఆహారం దొరకడం.. అదీ వేడివేడిగా రుచిగా సరసమైన ధరలకే లభిస్తుండటంతో ప్రతిఒక్కరూ ఆన్లైన్ ఫుడ్కే సై అంటున్నారు.
హోటళ్లు, రెస్టారెంట్లు కలుపుకుని గ్రేటర్లో 15 వేలు ఉన్నాయి. అందులో సుమారు 5 వేల హోటళ్లు ఆన్లైన్ ఫుడ్ సేవలను అందిస్తున్నాయి. కాగా ఫుడ్ ఇండస్ట్రీ లెక్కల ప్రకారం రోజుకు సుమారు 15 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. నెలకు సుమారు 450 కోట్లు. గతంతో పోలిస్తే ఆర్డర్స్ రెట్టింపు కావడంతో 25 శాతం బిజినెస్ పెరిగింది. ఒక్క ఐటీ కారిడార్కే సుమారు 3 లక్షల
ఆర్డర్స్ చేరుతున్నాయంటే ఆన్లైన్ ఫుడ్కు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు.
ఆన్లైన్ ఆర్డర్స్ సేవలను కస్టమర్లకు అందించడానికి గ్రేటర్లో 40 వేల మంది డెలివరీ బాయ్స్ పని చేస్తున్నారు. ఒక్కో డెలివరీ బాయ్కి రోజుకు కనీసం 30 నుంచి 40 ఆర్డర్స్ వస్తున్నాయి. ఒక్కో ఆర్డర్పై సుమారు 30 రూపాయల కమీషన్ ఉంటుంది. ప్రస్తుతం 27 ఆర్డర్స్ పూర్తి చేసుకుంటే రోజుకు 1600 రూపాయల ఆదాయం లభిస్తుంది. కస్టమర్ను బట్టీ టిప్స్ కూడా జత అవుతాయి. నెలకు 25 వేల నుంచి 40 వేల వరకు సంపాదించుకునే అవకాశం దొరికింది.
సిటీబ్యూరో, మే 24 ( నమస్తే తెలంగాణ): ఫుడ్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతికత జోడింపుతో హోటళ్లు, రెస్టారెంట్లు నెలకు వందల కోట్ల రూపాయల టర్నోవర్తో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ సర్వీస్కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కొవిడ్ పరిస్థితుల కారణంగా హోటల్, రెస్టారెంట్ రంగం తీవ్ర నష్టాల్లో ఉందని గత లెక్కలు చెప్పాయి. కానీ ఇప్పుడు లాక్డౌన్లో ఆ రంగానికి ఆన్లైన్ సర్వీస్ అనుమతి ఇవ్వడంతో గిరాకీ పుంజుకుంది. డెలివరీబాయ్స్తో అవి కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా కొవిడ్ ఇమ్యూనిటీ ఆహారాన్ని అందిస్తూ.. హైజెనిక్ మెయింటేన్ చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లలో వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇది గమనించిన కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు సొంతంగా యాప్లను రూపొందించుకుని హోం డెలివరీ సేవలను సైతం అందిస్తున్నాయి. చాలా మంది నగరవాసులు రొటీన్ ఫుడ్కు స్వస్తి చెప్పి.. తమకు నచ్చిన రుచులను ఆన్లైన్ సేవలతో తెప్పించుకుంటున్నారు. ఫలితంగా యాప్ ఆధారిత సేవలు జోరుగా సాగుతున్నాయి.
ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో ఆన్లైన్ ఫుడ్ అందించే హోటళ్లు, రెస్టారెంట్లు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రతీ డెలివరీ బాయ్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేయడంతో పాటు.. కాంటాక్ట్ లెస్ సేవలను అందిస్తున్నాయి. అంతేకాక “ మా డెలివరీ బాయ్ మాస్క్ ధరించాడా? నిర్ణీత సమయంలో ఆర్డర్ వచ్చిందా? మీరు ఆర్డర్ చేసిన వంటకాలతో సంతృప్తి చెందారా? ఇంకేమైనా ఫిర్యాదులు చేయాలనుకుంటున్నారా? అంటూ ఈ కామర్స్ యాప్లు కస్టమర్ల నుంచి రివ్యూ తీసుకుంటున్నాయి. వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా తమ సేవలను మరింతగా పారదర్శకంగా మార్చుకుంటున్నాయి. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, కొవిడ్ ఇమ్యూనిటీ ఫుడ్ తయారు చేసి ప్యాకేజీలుగా అందిస్తున్నాయి. కొవిడ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కస్టమర్లకు కావాల్సిన పోషకాహారాన్ని తయారు చేస్తున్నాయి. చాలా మంది కొవిడ్ బాధితులు ఇంట్లో వంట చేసుకోలేని కారణంగా స్విగ్గీ, జొమాటో, ఊబర్ఈట్లకు ఆర్డర్ ఇచ్చి ఆహారాన్ని తెప్పించుకుంటున్నారు.
హైదరాబాద్ అనేక మతాలకు నిలయం. ఇతర రాష్ర్టాలు, విదేశీయులు ఇక్కడ నివసిస్తున్నారు. వీరికి కావాల్సిన రుచులను అందించడంలో హైదరాబాద్ ప్రత్యేకతే వేరు. లాక్డౌన్లోనూ వారికి కావాల్సిన ఫుడ్ను అందిస్తూ కస్టమర్ల ప్రశంసలను హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు అందుకుంటున్నారు. ఈ క్రమంలో చైనీస్, ఇటాలియన్, నార్త్ ఇండియన్, బెంగాలీ, సౌత్ ఇండియన్ తదితర రుచులన్నీ అందుబాటులో ఉన్నాయి. అయితే ఆన్లైన్ ఆర్డర్స్లో అధికంగా నాన్వెజ్ ఫుడ్ ఎక్కువగా విక్రయం అవుతుందని తెలంగాణ స్టేట్ అసోయేషన్ వెల్లడించింది. ఇటీవల ఆ సంస్థ సేకరించిన లెక్కల ప్రకారం నగరంలో నాన్వెజ్ ఫుడ్ ఆర్డర్ 60 శాతం కాగా.. వెజిటేరియన్ 30 శాతం.. స్వీట్, ఇతర ఆహారపదార్థాలు 10 శాతంగా ఉన్నాయి. అందులోనూ సాయంత్రం 7 నుంచి అర్ధరాత్రి వరకు అధికంగా నాన్వెజ్ ఆర్డర్సే ఉంటున్నాయి. ఇందులో చికెన్ బిర్యానీ వాటా 50 శాతంగా ఉందని హోటల్ అసోసియేషన్లు చెబుతున్నాయి. గతంలో స్విగ్గీ, జొమాటో జరిపిన సర్వేలో సైతం చికెన్ బిర్యానీకే ఫుడ్ ప్రియులు ఓటేశారు.
మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, రాయదుర్గం తదితర ఐటీ కారిడార్లో యాప్ ఆధారిత సేవలు అధికంగా ఉంటున్నాయని హోటల్ వర్గాలు పేర్కొంటున్నాయి. సుమారు 7 లక్షల మంది ఉద్యోగులు అక్కడ విధులు నిర్వర్తించడం కారణంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ అదే స్థాయిలో ఉంటాయి. అయితే లాక్డౌన్ కారణంగా చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఈ కారణంగా అక్కడ సాగే బిజినెస్ కొంత పడిపోయిందని రెస్టారెంట్ వర్గాలు చెబుతున్నాయి. లాక్డౌన్లో ఫుడ్ డెలివరీ సేవలకు అంతరాయం లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫ్యామిలీలు అధికంగా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాయి. సాధారణంగా ఐటీ కారిడార్కు చెందిన వారు వారంలో కనీసం నాలుగు రోజులైన హోటల్, రెస్టారెంట్స్లోనే తింటుంటారు. లాక్డౌన్లో నచ్చిన ఆహారాన్ని ఇంటికి తెప్పించుకుని ఎంజాయ్ చేస్తున్నామని ఐటీ ఉద్యోగి మధు వివరించారు. ఫోన్, రెస్టారెంట్ వెబ్సైట్స్, డెలివరీ సర్వీస్ ద్వారా నిమిషాల్లో నచ్చిన ఆహారం వారి చిరునామాకు చేరుతుంది.
లాక్డౌన్ కట్టడి చేయాలనే ఉద్దేశంతో డెలివరీ బాయ్స్ వాహనాలను పోలీసులు తనిఖీ చేసి జరిమానాలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ సభ్యులు డెలివరీ బాయ్స్ కష్టాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు సోమవారం ఆ వాహనాలను విడుదల చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఆ సంస్థ చైర్మన్ షేక్ సలావుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఆ రెండు రోజులు పోలీసులు విధించిన చలానాల సొమ్ము కంపెనీ చెల్లిస్తుందంటూ స్విగ్గీ ప్రకటించింది. అందుకు సంబంధించిన ఫార్మెట్ను డెలివరీ బాయ్స్కు మెయిల్ చేసింది. వారు అందులో చలానా వివరాలు పొందుపర్చి దరఖాస్తు చేసుకుంటే చలానాల డబ్బులు కంపెనీ చెల్లించనుంది. స్విగ్గీ తీసుకున్న నిర్ణయం పట్ల సలావుద్దీన్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా జొమాటో మాత్రం చలానాల విషయమై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
లాక్డౌన్కు ముందు ఒక ఆర్డర్ చేరవేయడానికి డెలివరీ బాయ్స్కి నిర్ణీత సమయానికి కాస్త అటుఇటుగా పట్టేది. కానీ ఇప్పుడు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారడంతో చెప్పిన సమయానికే ఇంటికి ఆర్డర్ చేరవేస్తున్నారు. ఫలితంగా అధిక ఆర్డర్స్ దక్కించుకుంటున్నారు. ఇక డెలివరీ బాయ్స్ నచ్చిన సమయంలో ఉద్యోగం చేయవచ్చు. జస్ట్ యాప్ ఆన్ చేస్తే సరిపోతుంది. దీంతో ఇతర ఉద్యోగాలు చేస్తున్న కొంత మంది బ్యాచిలర్స్ రాత్రి సమయాల్లో డెలివరీ బాయ్గా సేవలందిస్తున్నారు. అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు నిరంతరాయంగా ఈ సేవలు కొనసాగుతుండటంతో ఫుడ్ ఇండస్ట్రీ మరింతగా విస్తృతమవుతున్నది. ఈ రంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు.
ఆన్లైన్ ఫుడ్ ఇండస్ట్రీకి ఉన్న డిమాండ్ కారణంగా చాలా హోటళ్లు, రెస్టారెంట్లు సొంతంగా యాప్ను రూపొందించుకుంటున్నాయి. స్విగ్గీ, జొమాటో, ఊబర్ఈట్లకు ఆర్డర్పై కొంత కమీషన్ చెల్లించాల్సి వస్తుండటంతో కొందరూ ఇలాంటి నిర్ణయం చేస్తున్నారు. ఇప్పటికే పిజా, ఐస్క్రీం స్టోర్లో తమ సిబ్బందితోనే ఆర్డర్స్ డెలివరీ చేస్తున్నారు. వీటి బాటలో ఇంకొన్ని రెస్టారెంట్లు నడవనున్నాయి. ఇటీవల తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్ ఆన్లైన్ ఫుడ్ సర్వీస్కు సంబంధించి నూతన యాప్ను ఆవిష్కరించే పనులను మొదలెట్టిన విషయం తెలిసిందే.
గతంలో కంటే లాక్డౌన్ సయమంలో ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ పెరిగాయి. మామూలు రోజుల్లో 20 అర్డర్స్ వస్తే, ప్రస్తుతం 30 నుంచి 40 వరకు వస్తున్నాయి. దీంతో కమీషన్ రెట్టింపు అయ్యింది. మూడేండ్లుగా డెలివరీ బాయ్ ఉద్యోగం చేస్తున్నా. ఫైవ్ స్టార్ రేటింగ్తో ముందుకు సాగుతున్నా. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఫుడ్ డెలివరీ చేస్తున్నా. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్డర్ ఇంటి బయటే పెట్టి వచ్చేస్తున్నా. -సీహెచ్. నరేష్, స్విగ్గీ డెలివరీ బాయ్
కొవిడ్ బాధితులకు సైతం ఫుడ్ డెలివరీ చేస్తున్నా. కొందరు వినియోగదారులు పార్సిల్ ఇంటి గేటు వద్దే పెట్టాలని సూచిస్తున్నారు. ఇది కొంత ఇబ్బందిగా అనిపించినా తప్పకుండా వారు చెప్పినట్టే చేస్తున్నా. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోలేక తప్పడం లేదు. లాక్డౌన్ సమయంలో ఆర్డర్లు రెట్టింపయ్యాయి. ఆదాయం కూడా కొంత పెరిగింది. -కె. అజయ్, జోమాటో డెలివరీ బాయ్
కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటిస్తున్నా. కస్టమర్లకు పార్సిల్స్ అందించేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నా. లాక్డౌన్ సమయంలో ఫుడ్ ఆర్డర్స్ పెరిగాయి. మా కష్టాన్ని గుర్తించిన కొన్ని ఆన్లైన్ ఫుడ్ యాప్లు కమిషన్ పెంచడం సంతోషంగా ఉంది. కొందరు అపార్ట్మెంట్ వాసులు లోనికి రానివ్వడం లేదు. దీంతో గేట్ బయటే ఆర్డర్ పెట్టి వస్తున్నాం. – జి.శ్రీశైలం, స్విగ్గీ డెలివరీ బాయ్
ఆన్లైన్ ఫుడ్ బిజినెస్కు మంచి డిమాండ్ ఉంది. లాక్డౌన్ కారణంగా ఇప్పుడు ఆన్లైన్ ఆధారిత యాప్లతో కస్టమర్లు ఫుడ్ను ఆస్వాదిస్తున్నారు. లాక్డౌన్కు ముందు సుమారు రూ.30 కోట్ల వరకు బిజినెస్ సాగేది. ఫుడ్ అందించడం కూడా అత్యవసర సేవే. ఐటీ కారిడార్ కేంద్రంగానే అధికంగా బిజినెస్ సాగుతుంది. డెలివరీ బాయ్కి ఒక ఆర్డర్ మీద 10 నుంచి 30 శాతం వరకు కమీషన్ దొరుకుతుంది. కొవిడ్ పరిస్థితుల కారణంగా అనేక జాగ్రత్తలు పాటించాలి. కొన్నింటిలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. హోటల్ రంగంపై ప్రభుత్వం దృష్టి పెడితే నాణ్యత పెరిగే అవకాశం ఉంది.-నాగరాజు, చైర్మన్, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్
లాక్డౌన్ పెడితే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయోనని అందరూ అనుకున్నారు. కానీ నా వరకు మాత్రం లాక్డౌన్ రోజులు సాఫీగానే గడుస్తున్నాయి. ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా చేతినిండా పని దొరుకుతుంది. అవసరాలకు సరిపడా డబ్బులు వస్తున్నాయి. ఈ సారి లాక్డౌన్ నుంచి ఈ కామర్స్ను మినహాయించడంతో గతంలో కంటే ప్రస్తుతం ఎక్కువ ఆదాయమే వస్తుంది. -సూర్య, ఫుడ్ డెలివరీ బాయ్
జొమాటో ఫుడ్ డెలివరీతో నెలకు రూ.22 వేలు సంపాదిస్తున్నా. నిబంధనలు పాటిస్తూ కస్టమర్ల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతున్నా. లాక్డౌన్లో ఆదాయం తగ్గుతుందనుకున్నా.. కానీ పెరిగింది. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి భారీ ఆదరణ లభిస్తున్నది. రోజుకూ నేను 30 నుంచి 35 ఆర్డర్లు అందిస్తున్నా. మామూలు రోజుల్లో వెయ్యి రూపాయలు సంపాదిస్తే రూ. 300లు ఇన్సెంటివ్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం రూ.600 ఇన్సెంటివ్ ఇస్తున్నారు. -రఘు కుమార్, ఫుడ్ డెలివరీ బాయ్
కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో మేం విధులు నిర్వహించడం గర్వకారణంగా ఉంది. నగరవాసులకు కావాల్సిన ఆహారాన్ని పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ అందిస్తున్నాం. భారీగా ఆర్డర్స్ పెరిగాయి. డెలివరీ సమయం పూర్తిగా తగ్గింది. ఫలితంగా ఎక్కువ ఆర్డర్స్ ఇవ్వగలుగుతున్నాం. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తున్నది. అడగకపోయినా సూపర్ రేటింగ్ ఇస్తున్నారు. టిప్ కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. శని, ఆదివారం పోలీసుల తనిఖీల్లో భాగంగా సేవలు సరిగా అందించలేకపోయాం. డీజీపీ సార్ సూచనలతో మా సేవలు కొనసాగుతున్నాయి. అక్కడక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. వేల రూపాయల ఫైన్ విధిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో మాపై కొంత ఉదారతతో ఉండాలని కోరుకుంటున్నాం. -శ్రీకాంత్, జొమాటో