న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఎంతో మంది పేషెంట్లకు ప్రాణాధారంగా మారిన మందుల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కేసులు భారీగా పెరిగిపోతుండటంతోపాటు కొందరు భయంతో ముందుగానే వీటిని కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. దీంతో పారాసిటమాల్, అజిత్రోమైసిన్, ఐవర్మెక్టిన్, డాక్సీసైక్లిన్, మెట్రోపెనెమ్ 1 జీఎం వంటి మందులకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఓవైపు వీటిని తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాల ధరలు 300 శాతం పెరిగాయి. అయితే ఇవి ప్రభుత్వ ధరల నియంత్రణ కిందికి రావడంతో ఆ ప్రభావం ఇప్పటి వరకూ వినియోగదారులపై పడలేదు.
కానీ ఇప్పుడు మాత్రం వీటికి డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక ధరల పెంపు తప్పేలా లేదని సదరు సంస్థలు చెబుతున్నాయి. ఐవర్మెక్టిన్ తయారీకి కావాల్సిన ముడిపదార్థం ధర కిలోకి రూ.17 వేల నుంచి రూ.58 వేలకు చేరింది. అజిత్రోమైసిన్ ముడిపదార్థం ధర కిలోకు రూ.3500 మేర పెరిగింది. అటు డాక్సీసైక్లిన్ పరిస్థితీ అంతే. ముడి పదార్థాల కోసం కిలోకు రూ.6 వేల ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. ఈ ధరలు ఇలాగే పెరుగుతూ వెళ్తే మందులు తయారుచేయలేని పరిస్థితి తలెత్తి కొరత ఏర్పడవచ్చని ముంబైలోని ఓ ఫార్మాసూటికల్ కంపెనీ సేల్స్ మేనేజర్ సుదీప్ నగర్ అన్నారు.
హోం క్వారంటైన్ పేషెంట్ల కోసం ప్రిస్క్రైబ్ చేస్తున్న మందుల తయారీకి ఖర్చు పెరిగిపోతోంది. మరోవైపు వాటి వినియోగం ఇంకా వేగంగా పెరిగింది. గతేడాది ఈ స్థాయిలో కొనలేదు. గతేడాదితో పోలిస్తే అజిత్రోమైసిన్, ఐవర్మెక్టిన్, విటమిన్ డీ3 మందుల అమ్మకాలు పది రెట్లు పెరిగాయి అని సుదీప్ చెప్పారు. మరోవైపు చైనా అత్యవసర వస్తువుల షిప్మెంట్ను ఆపేయడంతో ముడిపదార్థాల కొరత ఏర్పడిందని తెలిపారు.
ఇలాంటి కనీస మందులను మూడు నుంచి ఆరు నెలల కోసం ఫార్మా కంపెనీలు తయారు చేసి పెట్టుకుంటాయని, ఆ లెక్కన సెప్టెంబర్ వరకైతే వీటికి కొరత ఉండదని సుదీప్ చెప్పారు. మరోవైపు కరోనా షేపెంట్లందరికీ ఫాబిఫ్లూ మందులు రాస్తుండటంతో వాటికి తీవ్ర కొరత ఏర్పడింది. కొన్ని రోజులకు సరిపడా నిల్వలే ఉన్నాయి.