సిటీబ్యూరో/సుల్తాన్బజార్, జూలై 14(నమస్తే తెలంగాణ): పరాచకం, వెటకారంతో ఎత్తిపొడుపు మాటలు కాల్పులకు ప్రేరేపించాయి. జోక్లు వద్దని పలుమార్లు వారించినా వినకపోవడంతో కోపోద్రిక్తుడైన సెక్యూరిటీ గార్డు తనవద్దనున్న గన్తో స్వీపర్పై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడిన స్వీపర్ను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు పూర్వాపరాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన బుధవారం అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.
అబిడ్స్ ఏసీపీ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ పొందిన వరంగల్ జిల్లాకు చెందిన ఎండీ సర్దార్ఖాన్(54) తొమ్మిదేండ్లుగా గన్ఫౌండ్రీ ఎస్బీఐలో సెక్యూరిటీ గార్డు (గన్ లైసెన్స్డ్)గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఇదే బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సురేందర్కు ఏడేండ్లుగా సర్దార్ఖాన్తో పరిచయం ఉంది. వీరిమధ్యనున్న పరిచయంతో సురేందర్ తరచూ సర్దార్ఖాన్తో పరాచకం ఆడుతాడు. పదేపదే పరాచకాలు, వెటకారం వద్దని వారించినా సురేందర్ వినేవాడు కాదని తోటి ఉద్యోగులను విచారించగా తెలిసింది. బుధవారం కూడా సురేందర్ పలుమార్లు సర్దార్ఖాన్పై జోకులు వేస్తూ.. జో కుతావురా.. అనే పదాన్ని పదేపదే వాడాడు. దీంతో కోపోద్రిక్తుడైన సర్దార్ఖాన్ మధ్యాహ్నం 3.25 గంటల సమయంలో తన వద్ద ఉన్న లైసెన్స్ బోర్ గన్తో సురేందర్పై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. రెండు రౌండ్ల బుల్లెట్లు గోడకు తగిలాయి. మూడో రౌండ్ బుల్లెట్ మాత్రం సురేందర్ శరీరంలోకి దూసుకువెళ్లింది.
తీవ్ర గాయాలైన సురేందర్ను బ్యాంకు ఉద్యోగులు వెంటనే చికిత్స నిమిత్తం హైదర్గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సురేందర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని ఏసీపీ తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన క్లూస్ టీం బృందం పూర్తిగా పరిశీలించి ఆధారాలు సేకరించింది. జరిగిన సంఘటనపై సురేందర్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. సెక్యూరిటీ గార్డు సర్దార్ఖాన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలాఉండగా, నిజాం హయాంలో ప్రారంభమై, నగరం నడిబొడ్డున ఉన్న గన్ఫౌండ్రీ ఎస్బీఐలో కాల్పులు చోటు చేసుకోవడంతో ఉద్యోగులు, ఖాతాదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 75 ఏండ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ బ్యాంకులో మొట్టమొదటి సారి కాల్పుల ఘటన చోటు చేసుకుందన్నారు. పరాచకం, వెటకారం మాటలు మూడు రౌండ్ల కాల్పులకు దారి తీసిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ పేర్కొన్నారు.
గత మార్చి నెలలో కూడా కాలాపత్తర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ కుటుంబంలో చోటు చేసుకున్న కలహాల నేపథ్యంలో భర్త కోపంతో భార్యా పిల్లలపై లైసెన్స్ గన్తో కాల్పులు జరిపాడు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.