మన్సూరాబాద్, ఆగస్టు 1: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక బస్సు, రెండు ఆటోలు, గోదాంలోని ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో సుమారు రూ. 50 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది. సీఐ అశోక్రెడ్డి కథనం ప్రకారం.. ఎల్బీనగర్ నివాసి బాలెముల జలపతిరెడ్డి సాగర్ రింగ్రోడ్డు సమీపంలోని అలేఖ్య టవర్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో స్క్రాప్ గోదాం (ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాల)ను నిర్వహిస్తున్నాడు. వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాలను ఇక్కడ డంప్ చేసి విక్రయిస్తారు. రోజు మాదిరిగానే శనివారం రాత్రి గోదాంను మూసిచేసి ఇంటికి వెళ్లి పోయాడు.
ఆదివారం తెల్లవారుజామున 3:30గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గమనించిన వాచ్మన్ వెంటనే యజమాని జలపతిరెడ్డికి సమాచారం ఇచ్చాడు. జలపతిరెడ్డి వెంటనే ఎల్బీనగర్ పోలీసులకు, ఫైర్ స్టేషన్కు సమాచారం అందించాడు. ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకునే లోపే గోదాంలో ఉన్న రెండు ఆటోలతో పాటు పక్కన ఖాళీ స్థలంలో పార్కు చేసిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో పాటు స్క్రాప్ గోదాంలోని ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాలు ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు రూ. 50 లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో ప్రమాదం జరుగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. గోదాం యజమాని జలపతిరెడ్డి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.