హిమాయత్నగర్, మే17: గాఢనిద్రలో అర్ధరాత్రి అకస్మాత్తుగా సంభవించిన ప్రమాదం ఒకరి ప్రాణాల్ని కబళించింది. సమయానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకోవడం తో నలుగురు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హైదర్గూడ, అవంతినగర్లో శాంతరామ్, శోభ దంపతుల కుటుంబం నివాసం ఉం టుంది. వీరికి బద్రీనాథ్, గౌరీనాథ్, శ్రీనాథ్ కుమారులు. ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఆదివారం ఉదయం శాంతరామ్ దంపతులు.. చిన్న కుమారుడు శ్రీనాథ్, అతని భార్య దివ్యతో కలిసి వికారాబాద్లోని ఫామ్హౌస్కు వెళ్లారు. బద్రీనాథ్ భార్య, పిల్లలు మూడు రోజుల క్రితం తల్లిగారింటికి వెళ్లారు. బద్రీనాథ్తో పాటు గౌరీనాథ్ కుటుంబాన్ని ఫామ్హౌస్ రావాలని తల్లిదండ్రులు చెప్పగా ఒక రోజు ఆగి వస్తామని చెప్పారు.
ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత రెండోఅంతస్తులోని ఒక గదిలో గౌరీనాథ్, అతని భార్య మీనా, పిల్లలు లోకేష్, విజ్ఞేష్ పడుకోగా.. మరో గదిలో బద్రీనాథ్ పడుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున 3: 45 నిమిషాలకు మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం సంభంవించి రెండో అంతస్తులోకి మంటలు అంటుకున్నాయి. నిద్ర మత్తులో ఉన్న వీరికి ఒక్కసారిగా వేడి తగలడంతో లేచి చూసేసరికి చుట్టూ మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. బద్రీనాథ్ వెంటనే 100,101కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. వెంటనే నారాయణగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాత్రూం కిటికీ నుంచి బద్రీనాథ్ తన చేతిని బయటకు పెట్టి పోలీసులకు పిలిచాడు. రెండో అంతస్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించి.. కిటికీని తొలిగించి అందుల్లో నుంచి బద్రీనాథ్, మీనా, ఇద్దరు పిల్లలను రక్షించారు. గాయాలైన ఈ నలుగురిని హైదర్గూడలోని అపోలో దవాఖానకు తరలించారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్న గౌరీనాథ్(38)ను ఎట్టకేలకు బయటకు తీసుకువచ్చారు. కానీ అతడిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు . మెరుగైన వైద్యంకోసం చిన్నారులు లోకేష్,విజ్ఞేష్లను బంజారాహిల్స్లోని రెయిన్బో దవాఖానకు తరలించారు.
అగ్నిప్రమాదంతో ఇంట్లోని సామగ్రి మొత్తం కాలిబూడిదైంది. తల్లిదండ్రులతో కలిసి వీరు వికారాబాద్కు వెళ్లిఉంటే ప్రమాదం నుంచి బయటపడేవారని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్వంతమయ్యారు. మృతుడు గౌరీనాథ్ మృత దేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా? మరేదైనా ఇతర కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్సై చందర్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.