ఆదరణ కోల్పోతున్న నాటకరంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. సాహితీ ప్రియుడైన సీఎం కేసీఆర్ తెలంగాణ సంగీత నాటక అకాడమీని ఏర్పాటు చేసి రంగస్థల కళలకు ప్రాణం పోస్తున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కొత్తతరం కళాకారులను ప్రోత్సహించేలా నాటకోత్సవాలు, ప్రత్యేక శిక్షణ నిర్వహించడంతోపాటు నాటక ప్రదర్శనలకు ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 4వేల మందికిపైగా వృద్ధ కళాకారులకు పింఛన్ అందిస్తున్నది. నాటకరంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహం వారి మాటల్లోనే…!
ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి సీనియర్ రంగస్థల కళాకారులను గుర్తించి రవీంద్రభారతి వేదికపై సత్కరించడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సముద్రాల వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు. రంగస్థల నాటకోత్సవాల్లో భాగంగా రెండోరోజు శుక్రవారం జరిగిన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. కళాకారుల అభ్యున్నతికి సంగీత నాటక అకాడమీ ఏర్పాటైందని, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతోనే ఇది సాధ్యమైందని గుర్తుచేశారు. కాగా తడకమల్ల రామచందర్రావు దర్శకత్వంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వారిచే నరకేసరి పౌరాణిక పద్య నాటకం ప్రదర్శన ఉత్సాహంగా జరిగింది. ముఖ్యఅతిథిగా సినీనటి, భక్తప్రహ్లాదుడిగా నటించిన రోజారమణి హాజరయ్యారు.
150 మందికి సత్కారం
సంగీత నాటక అకాడమీ ఆధ్యర్యంలో రవీంద్రభారతిలో నాటకోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా నాటక రంగానికి కృషి చేసిన కళాకారులు 60 ఏండ్లుపైబడిన వారిని గుర్తించి 150 మందికిపై రవీంద్రభారతి వేదికపై సత్కరిస్తున్నాం. -బాద్మి శివకుమార్, సంగీత,నాటక అకాడమీ చైర్మన్
120కి పైగా కొత్త నాటకాలొచ్చాయి
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత నాటకరంగంలో వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా యువతరం ఈ రంగంలో ప్రయోగాలు చేసేందుకు ముందుకు వస్తున్నది. సుమారు ఏడేండ్లలో 120కి పైగా కొత్త నాటకాలు వెలుగుచూశాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నాటక రంగానికి కృషి చేస్తున్నది. కేవలం తెలుగు నాటకాలే కాకుండా ఉర్దూ, హిందీ, కన్నడం, ఆంగ్ల భాష నాటకాల ప్రదర్శనలు చేపట్టి ఇక్కడి కళాకారుల్లో స్ఫూర్తి కలిగిస్తున్నాం. -మామిడి హరికృష్ణ, డైరెక్టర్, భాషా సాంస్కృతికశాఖ
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక యువ కళాకారులతో ఆధునిక నాటకాలు వస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, భాషా సాంస్కృతిక శాఖ ఇస్తున్న స్ఫూర్తితో నాటకరంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. తెలంగాణ యాసలోనే విరివిగా నాటక రచనలు చేసేందుకు యువతరం ముందుకు వస్తున్నది. -వరకవుల నరహరిరాజు, నాటక రచయిత,సంగీత దర్శకుడు
కాకతీయుల కాలం నుంచి
కాకతీయుల కాలం నుంచి తెలంగాణ ప్రాంతంలో నాటకం, నృత్య కళా ప్రదర్శనలతో కళాకారులు ప్రజలను అలరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి కళాకారులకు అంతగా గుర్తింపు ఉండేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తుండడం వల్ల నాటక కళాకారులు అనేకమంది ముందుకొస్తున్నారు. -అంజిలయ్యగౌడ్, రంగస్థలనటుడు