హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్ నియంత్రణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలకు చెందిన 641 బృందాలు ఇంటింటి సర్వే నిర్వహించాయి. ఒక్కో బృందంలో ఓ ఏఎన్ఎం, ఆశావర్కర్, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బందితో కూడిన సభ్యులు ఇంటింటికి తిరిగి థరల్ స్కానర్తో పరీక్షణలు నిర్వహించారు.
ఒక్కరోజే 40వేల ఇళ్లలో సర్వే చేపట్టి 1487 మంది జ్వరంతో ఉన్నారని గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న 1487 మందిలో 1400 మందికి వెంటనే కొవిడ్ మందుల కిట్ అందజేశారు. బాధితుల వివరాలు సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటీ లార్వా ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. సోమవారం నుంచి నగరంలో ప్రారంభమైన ఈ ఫీవర్ సర్వేలో ప్రాథమికంగా 393 సర్వే బృందాలు పాల్గొన్నాయి. మంగళవారం ఈ బృందాల సంఖ్య 641కు పెంచారు.
నగరంలోకి ప్రతి బస్తీ దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దావఖానల్లో కొవిడ్ అవుట్ పేషంట్లకు పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించడంతో నేడు అన్ని ఆసుపత్రుల్లో 18,600 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
వీరిలో 3,600 మందికి స్వల్ప జ్వరం ఉన్నట్లు గుర్తించి వారికి కరోనా నివారణ మందుల కిట్లను అందజేశారు. ఇంటింటి సర్వే, ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్య పరీక్షల నిర్వహణను సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.